మాట ప్రకారం ఉచిత సిలిండర్ల పంపిణీ: నాదెండ్ల
ABN, Publish Date - Apr 05 , 2025 | 02:26 AM
ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం దీపం-2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

తిరుపతి అర్బన్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం దీపం-2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి నగరం శ్రీకృష్ణదేవరాయల వీధిలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, ప్రభుత్వ విప్ శ్రీధర్, కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభంబన్సల్తో కలసి ఆయన శుక్రవారం రాత్రి లబ్ధిదారు డి.చిన్నఈశ్వరమ్మకు సిలిండర్ పంపిణీ చేసి మాట్లాడారు. సూపర్సిక్స్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీలో మొదటి, రెండు విడతలను తిరుపతి నుంచే ప్రారంభించినట్లు చెప్పారు. తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ సిలిండర్లు ఇస్తున్నామని, ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల భారం పడుతోందని వెల్లడించారు. కొత్తగా రెండు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్, సివిల్ సప్లయిస్ డీఎం సుమతి, డీఎస్వో శేషగిరిరాజు, జనసేన జిల్లా, నగరాధ్యక్షులు పి.హరిప్రసాద్, రాజారెడ్డి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 02:26 AM