‘పట్టు’పడితే పూర్వవైభవం
ABN, Publish Date - Mar 17 , 2025 | 01:59 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 38 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. అయినా పలమనేరులోని పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం దశాబ్ద కాలంగా మూతపడింది. ఒకప్పుడు ఈ కేంద్రం కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు పట్టించుకునే నాథుడి కోసం ఎదురుచూస్తోంది.
పలమనేరులో దశాబ్దకాలంగా మూతపడ్డ పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం
నిరుపయోగంగా మారిన కోట్లాది రూపాయల భవనాలు, పరికరాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 38 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. అయినా పలమనేరులోని పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం దశాబ్ద కాలంగా మూతపడింది. ఒకప్పుడు ఈ కేంద్రం కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు పట్టించుకునే నాథుడి కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం కాస్త శ్రద్ధ పెడితే పూర్వవైభవం సంతరించుకుంటుంది.
- పలమనేరు, ఆంరఽధజ్యోతి
పలమనేరులో నాలుగు దశాబ్దాల క్రితం పట్టణానికి ఆనుకుని 7.5 ఎకరాల స్థలంలో పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఇక్కడ పట్టుగుడ్లు ఉత్పత్తి చేశారు. సుమారు 50 కోట్లకుపైగా విలువైన స్థలంలో ఈ కేంద్రం ఏర్పాటైంది. పట్టుగుడ్ల ఉత్పత్తికి అవసరమైన పలు భవనాలను కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ నిర్మించారు. అంతేగాక పట్టుపురుగులకు కావాల్సిన మల్బరీ తోటలను కూడా సాగు చేస్తుండేవారు. ఇందుకోసం ఒక పెద్ద వ్యవసాయ బావిని, పంపుషెడ్డును కూడా పట్టు పరిశ్రమశాఖ అప్పట్లో నిర్మించింది. నీటిని లిఫ్టింగ్ చేసి, నిల్వ ఉంచడానికి ఒక విశాలమైన తొట్టెను కూడా బావిపక్కనే ఏర్పాటు చేశారు. ఈ బావిలో వేసవి కాలంలో తగిన మేర నీరు రావడం లేదని నాలుగు బోర్లు వేశారు. రెండు బోర్లలో నీరు సరిగా రాలేదని.. మోటర్లు తొలగించారు. నేడు వ్యవసాయ బావికున్న మోటరు, రెండు బోర్లకున్న మోటర్లు తుప్పు పడుతున్నాయి. అప్పట్లో నాటిన యుకలిప్టస్ మొక్కలు నేడు దాదాపు 100 అడుగుల ఎత్తు పెరిగాయి. మల్బరీ తోటలకు నీరు అందించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి వేసిన పైపులైన్లు కూడా వృథా అయ్యాయి.
వృథాగా ట్రాన్స్ఫార్మర్
మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అప్పట్లో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఇది కూడా ప్రస్తుతం వృథాగా పడి ఉంది.
వర్మికల్చర్ షెడ్డుదీ అదేదారి
నాణ్యమైన మల్బరీ ఆకు ఉత్పత్తి కోసం వర్మి కల్చర్ షెడ్డును నిర్మించారు. ఇక్కడ ఎరువును తయారు చేసి.. మల్బరీ తోటలకు వినియోగించేవారు. ప్రస్తుతం ఈ షెడ్డు కూడా నిరుపయోగమైంది.
చీకటి, అసాంఘిక కార్యకలాపాలు
పట్టణ పొలిమేరల్లో ఉండటంతో నేడీ కేంద్రం చీకటి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మందుబాబులు, పేకాటరాయుళ్లకు అడ్డాగానూ తయారైంది.
ప్రత్యేకాధికారి మదనపల్లెలో..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టుగుడ్ల తయారీ కోసం ఒక ప్రత్యేక అధికారిని పట్టుపరిశ్రమ శాఖ నియమించింది. ఆ అధికారి మదనపల్లెలో ఉంటూ పట్టుగుడ్ల ఉత్పత్రి కేంద్రాన్ని పరిశీలిస్తుంటారని సెరికల్చర్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. జిల్లా విభజనతో మదనపల్లె.. అన్నమయ్య జిల్లాకు వెళ్లినా.. పర్యవేక్షణ మాత్రం అక్కడి అధికారి పరిధిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా జిల్లాలోని పట్టుపరిశ్రమ అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ పట్టుగుడ్ల తయారీ కేంద్రానికి పూర్వవైభవం తేవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Mar 17 , 2025 | 01:59 AM