చంద్రబాబు పీ-4 బూటకం: రామకృష్ణ
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:21 AM
చంద్రబాబు పీ-4 పేదరికానికి పరిష్కారం కాదని, అది బూటకం మాత్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పేద, ధనిక తారతమ్యం పెరగడానికి మోదీ, చంద్రబాబు ఆర్థిక విధానాలే కారణమన్నారు.

అనంతపురం విద్య, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు చెబుతున్న పీ-4 బూటకం. పేదరికం ఎందుకు వస్తోంది? పేదలు, ధనికుల మధ్య తారతమ్యాలు ఎందుకు ఉన్నాయి? ఇవేమీ చెప్పకుండా... పీ-4తో, పేదరికానికి లింకు పెట్టడం విడ్డూరంగా ఉంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కొందరు ధనికుల దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని పేదలకిస్తే... పేదరికం పోతుందని సీఎం చెప్పడం ప్రజల చెవిలో వంద శాతం పూలు పెట్టడమే. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అవలంబిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే దేశంలో, రాష్ట్రంలో పేద, ధనిక తారతమ్యం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణకు బిల్లుకు సైతం టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం సరికాదు’ అని రామకృష్ణ అన్నారు.