DGP Hari Shankar Gupta : మహిళల జోలికొస్తే మరణదండనే!
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:51 AM
ఇటీవల అన్నమయ్య, గుంటూరు, పల్నాడు సహా పలు జిల్లాల్లో మహిళలపై జరిగిన దాడులను రాష్ట్ర పోలీసుశాఖ సీరియ్సగా తీసుకుంది.

డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరిక
అన్నమయ్య, గుంటూరు, పల్నాడు జిల్లాల ఘటనలపై సీరియస్
కృత్రిమ మేధ సాయంతో ఎక్కడికక్కడ నిఘా
సైకో రోమియోల కట్టడికి స్పష్టమైన ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల జోలికి ఎవరొచ్చినా, అబలలపై అఘాయిత్యాలకు పాల్పడినా మరణశిక్ష నుంచి తప్పించుకోలేరని డీజీపీ హరీ్షకుమార్ గుప్తా హెచ్చరించారు. ఇటీవల అన్నమయ్య, గుంటూరు, పల్నాడు సహా పలు జిల్లాల్లో మహిళలపై జరిగిన దాడులను రాష్ట్ర పోలీసుశాఖ సీరియ్సగా తీసుకుంది. ఈ దాడులకు పాల్పడినవారిని అరెస్టు చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా మరణశిక్ష పడేలా పకడ్బంధీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, న్యాయనిపుణులతో చర్చించిన డీజీపీ మహిళలపై నేరాలకు పాల్పడేవారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఎక్కడికక్కడ నిఘా పెంచాలని, సైకో రోమియోలపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయాలని క్షేత్రస్థాయి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. న్యాయస్థానాలు, న్యాయవాదులు, జైళ్లు, ఎన్జీవోలు, మహిళా సంఘాలు, సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తితో సమన్వయం చేసుకుంటూ దేశంలోనే మహిళలకు అత్యంత రక్షణ ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ ఒక్క మహిళ భయపడాల్సిన అవసరం లేదని, ఏ చిన్న ఆపద ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదిస్తే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆడబిడ్డల విషయంలో తమ బిడ్డలు అదుపు తప్పకుండా యువకుల తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలని, వారి వల్ల కాకపోతే పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు కూడా సంకోచించవద్దని సూచించారు. మైనర్లు, వృద్ధులపై యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడేవారి వయసు 20 నుంచి 75 సంవత్సరాల వరకు ఉంటోందని, వీరి వల్ల బాధిత కుటుంబాలతోపాటు సమాజంలోనూ శాంతి, సామరస్యాలకు విఘాతం కలుగుతోందని, ప్రజల్లో భయం, అభద్రతా వాతావరణం నెలకొంటోందని చెప్పారు.
ఇలాంటి ఘోరమైన నేరాలను సీరియ్సగా తీసుకోవడంతోపాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోడానికి రాష్ట్ర పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి కేసుల్లో చట్ట ప్రకారం జీవితకాలం జైలు, మరణశిక్ష కూడా పడేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చట్టం నుంచి తప్పించుకోలేరు
లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, ఇతర తీవ్రమైన నేరపూరిత స్వభావం, ధోరణులను కలిగి ఉన్న ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని డీజీపీ హెచ్చరించారు. అలాంటివారు వెంటనే తమ మార్గాలను సరిదిద్దుకోవాలని సూచించారు. వారిపట్ల పోలీసులకు ఉదాశీనత ఉండదని స్పష్టం చేశారు. అలాంటి నేరస్థులను గుర్తించడం, ట్రాక్ చేయడం, న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో పోలీసు యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నేరాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సైబర్ సెల్స్ చురుగ్గా పని చేస్తున్నాయన్నారు. ఈ నేరస్థులకు ఆశ్రయం కల్పించడం, మద్దతు, వనరులను అందించే వ్యక్తులు, సమూహాలు, నెట్వర్క్లపైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
నిఘా తీవ్రతరం
నేటి డిజిటల్ యుగంలో నేరస్థులు తమ అక్రమ కార్యకలాపాలకు సైబర్ స్పేస్ను ఉపయోగించుకుంటున్నారని డీజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ సైబర్ క్రైం విభాగాన్ని మరింత పటిష్టం చేసి, వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫారాలలో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘాను తీవ్రతరం చేసినట్లు వివరించారు. ఆన్లైన్లో లైంగిక వేధింపుల(డిజిటల్ వేధింపులు) కు పాల్పడటం, హింసాత్మక దాడులకు ప్లాన్ చేసేవారిని ట్రాక్ చేసి చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకా రం కేసులు నమోదు చేసి విచారిస్తామని వివరించారు. నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విఽధానంలో రాష్ట్ర పోలీసుశాఖ పని చేస్తుందని డీజీపీ చెప్పారు.