Palnadu district: వైసీపీ కార్యకర్తలను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాం
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:53 AM
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన వైసీపీ కార్యకర్తల రిమాండ్ ఉత్తర్వులను హైకోర్టు సమీక్షిస్తోంది. అక్రమ నిర్బంధం ఆరోపణలపై విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.

ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు
హైకోర్టుకు నివేదించిన ఎస్జీపీ
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా, మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి పెద్ద సైదా, చింతపల్లి అల్లాభక్షులను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్సజీపీ) టి.విష్ణుతేజ బుధవారం హైకోర్టుకు నివేదించారు. మెజిస్ట్రేట్ జ్యుడీషియల్ రిమాండ్ విధించారని, ప్రస్తుతం వారిరువురూ గురజాల సబ్జైల్లో ఉన్నారని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రిమాండ్ ఉత్తర్వులపై ఆరా తీసింది. తదుపరి విచారణలో ఉత్తర్వులను తమ ముందు ఉంచాలని ఎస్జీపీ, నిందితుల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తన కుమారుడు సత్తెనపల్లి పెద్ద సైదా, తన మేనల్లుడు చింతపల్లి అల్లాభక్షును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిన్నెల్లికి చెందిన షేక్ చింతపల్లి నన్నే, గుంటూ రు జానీ బాషా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించా రు. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది రామ్లక్ష్మణ్ వాదనలు వినిపిస్తూ.. నిందితుల విషయంలో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించలేదన్నారు. నిందితులను తీవ్రంగా కొట్టారని, ఈ విషయాన్ని బయటకు చెబితే కుటుంబ సభ్యులపై గంజాయి కేసు పెడతామని బెదిరించారని వివరించారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..