Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:18 PM
Nagababu MLC candidate ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు.

అమరావతి, మార్చి 5: ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సోదరుడు కొణిదెల నాగబాబు (Konidela Nagababu)పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు పవన్. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒకరి అభ్యర్థి పేరు ఖరారైంది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడాన్ని గమనించిన జనసేన ఆయనకు రాజ్యసభకు పంపాలని భావించారు.
Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకునున్నప్పటికీ ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి... ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అనే సూచనలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు (బుధవారం) ఉదయం సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్... ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేసినట్లు జనసేన పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ అధికారికంగా జనసేన గ్రూప్లో పోస్ట్ చేశారు.ఈనెల పదవ తేదీలోపు నామినేషన్ వేయాల్సిన నేపథ్యంలో మంచి రోజు చూసుకుని నాగబాబు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించగా.. ఐదుగురు కలిసి నామినేషన్ వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇక ఐదుగురు ఎమ్మెల్సీలో నాగబాబు పేరు ఖరారవగా.. మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్తే ఐదు ఎమ్మెల్సీల్లో ఒకటి టీడీపీ నుంచి వంగవీటి రాధాకు ఇస్తారనే అంతా భావించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు చేయడంతో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీజేపీ అడుగగా.. ఇప్పటికే ఒక స్థానం నాగబాబుకు ఇచ్చేయడంతో బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు ముందుగానే స్పష్టం చేసినట్లు తెలిసింది. మరి మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనేది ఉత్కంఠంగా మారింది.
ఇవి కూడా చదవండి...
Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను
Karimnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. బీజేపీ ముందంజ
Read Latest AP News And Telugu News