బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమిపూజకు సర్వం సిద్ధం

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:23 PM

పీసీపల్లి, మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలోని దివాకరపల్లి సమీపంలో బుధవారం జరగనున్న రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమిపూజకు సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పర్యవేక్షణలో వివిధశాఖల అధికారులు పనులన్నీ పూర్తిచేశారు.

బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమిపూజకు సర్వం సిద్ధం
ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రతిపాదిత ప్రాంతానికి 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం

ముఖ్యఅతిథుల కోసం రెండు హెలిప్యాడ్‌లు సిద్ధం

వాహనాల పార్కింగ్‌కు వేర్వేరు ప్రాంతాలు

పీసీపల్లి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలోని దివాకరపల్లి సమీపంలో బుధవారం జరగనున్న రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమిపూజకు సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పర్యవేక్షణలో వివిధశాఖల అధికారులు పనులన్నీ పూర్తిచేశారు. విద్యుత్‌ లైన్లు ఏర్పాటుచేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చి విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించారు. భూమిపూజ జరిగే ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా వీఐపీలకు మురుగుమ్మి నుంచి ప్లాంట్‌ వరకు మూడు కిలోమీటర్లు, దివాకరపల్లి నుంచి ప్లాంట్‌ వరకు నాలుగు కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్‌ అధికారులు రోడ్లు వేయించారు. వీవీఐపీల రాకకోసం ఆర్‌అండ్‌బీ అధికారులు రెండు హెలిప్యాడ్‌లను నిర్మించారు. బహిరంగ సభ జరిగే ప్రాంతంలో స్టేజీ నిర్మాణంతో పాటు ప్రజలకు ఎండ తగలకుండా జర్మన్‌ షెడ్‌లు ఏర్పాటుచేశారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్‌ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర, పోలీసులకు, అధికారులకు ట్రాఫిక్‌ సమస్యపై పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట వెంగళాయపల్లి సర్పంచ్‌ కరణం తిరుపతయ్య, మండలంలోని వివిధశాఖల అధికారులు, మండల నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌, పామూరు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరాంరెడ్డి, కావేటి సుబ్బయ్య, సీఎ్‌సపురం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంగయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:23 PM