Andhra Pradesh Aqua Industry: రొయ్య విలవిల

ABN, Publish Date - Apr 05 , 2025 | 02:23 AM

ట్రంప్‌ ప్రభుత్వం విధించిన 27% ప్రతీకార సుంకాల ప్రభావంతో రాష్ట్రంలోని రొయ్యల పరిశ్రమ సంక్షోభంలోకి నెరుగుతోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే వేల కోట్ల రూపాయల నష్టం తథ్యం.

Andhra Pradesh Aqua Industry: రొయ్య విలవిల

ట్రంప్‌ సుంకాలతో ఆక్వాకు శరాఘాతం

ఏపీ నుంచి ఎగుమతులపై తక్షణ దెబ్బ

ఇప్పటికే మొదలైన ధరల పతనం

దేశంనుంచి 40ు ఉత్పత్తులు అమెరికాకే..

27ు సుంకాలకు ఇతర డ్యూటీలూ

కలిపితే 35 శాతం వరకు అదనపు భారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అమెరికా విధించిన ప్రతీకారసుంకాల తీవ్రత రాష్ట్రంలో ఆక్వారంగాన్ని నేరుగా తాకింది. ఇప్పటికే రొయ్యలకు వ్యాధులు ప్రబలి, సాగు ఖర్చులు భారమై సతమతమవుతున్న రొయ్యల సాగుదార్లపై ట్రంప్‌ తాజాఆంక్షలు సమ్మెటపోటుగా పరిణమించాయి. భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం విధించిన 27ు ప్రతీకార సుంకం ఈనెల తొమ్మిదోతేదీ నుంచి అమల్లోకిరానుంది. అయితే, సుంకాల ప్రకటన వెలువడిన కొన్నిగంటల్లోనే రొయ్యల ధరల్లో పతనం మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే సముద్ర ఆహార ఎగుమతి పరిశ్రమ సంక్షోభంలో పడిపోతుందని ఆక్వా రంగ భాగస్వామ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగు,ఉత్పత్తి,ఎగుమతుల్లో దేశంలో ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఊతమిస్తోంది. జీఎ్‌సడీపీలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతంగా ఉంది. అయితే, ప్రధానంగా ఈ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. 2023-24లో భారత్‌ నుంచి 4.88 బిలియన్ల విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో ఇది 66ు కంటే అధికం. భారత రొయ్యలకు అతి పెద్ద మార్కెట్‌ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 40ుపైగా రొయ్యలు అమెరికాకు భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత సముద్ర ఉత్పత్తులపై 27ు సుంకం విధించబడటం వల్ల మన రొయ్య యూఎస్‌ మార్కెట్‌ను తట్టుకొని పోటీలో నిలవలేదు.


మార్కెట్‌ను మరిచిపోవాల్సిందే..

అమెరికా సుంకాల ప్రభావం కేవలం యూఎ్‌సకు జరుగుతున్న రొయ్యల ఎగుమతులకే పరిమితంకాదు. ద్వితీయ ఎగుమతి మార్గాలను కూడా తీవ్రంగా దెబ్బతీయనుంది. అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న చైనా, వియత్నాంలకు 35 శాతం రొయ్యల ఉత్పత్తులు మన దేశం నుంచి వెళుతున్నాయి. తిరిగి ఈ రెండు దేశాలూ తాము దిగుమతి చేసుకున్న రొయ్యల్లో చాలా భాగం యూఎ్‌సకే ఎగుమతి చేస్తుండటం గమనార్హం. అయితే, చైనా,వియత్నాం నుంచి యూఎ్‌సకు ఎగుమతులపై 30ు కంటే ఎక్కువ సుంకాలు ట్రంప్‌ తాజాగా విధించారు. దీంతో ఆ దేశాల నుంచి మనకు ఆర్డర్లు తగ్గిపోతాయి. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం అత్యవసరం. ఇప్పటికే ఉన్న 5.76 శాతం కౌంటర్‌ వేలింగ్‌ డ్యూటీ (సీవీడీ), 1.35ు నుంచి 3ు మధ్య ఉన్న యాంటీ-డంపింగ్‌ డ్యూటీలను కూడా కలుపుకొంటే ఈ సుంకాల భారం 33-35ు వరకు ఉండవచ్చు. అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న ఈక్వడార్‌ వంటి దేశాలపై కేవలం 16ు సుంకాన్ని మాత్రమే ట్రంప్‌ ప్రభుత్వం విధించింది. దీంతో భవిష్యత్తులో మనకు ఈక్వడార్‌ ప్రధాన పోటీదారుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్షణంగా ఇప్పటికే రవాణాలో ఉన్న రొయ్యల ఉత్పత్తులు ప్రభావితమౌతాయి. సుమారు రూ. రెండు వేల కోట్ల విలువైన రెండు వేల కంటైనర్లు ఇప్పుడు రూ.600కోట్ల అదనపు ఖర్చు మోయాల్సి ఉంటుంది.


కేంద్రమే దిక్కు...

కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం రొయ్యల ఎగుమతులను ప్రోత్సహిస్తూ ప్రాసెసింగ్‌ యూనిట్లను నడిపింది. కానీ ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రత్యామ్నాయ మార్కెట్లు కనిపించడం లేదు. ఏపీలో రొయ్యల పరిశ్రమ ఉపాఽధికల్పనకు ఊతం ఇస్తోంది. రాష్ట్రంలో 450పైగా రొయ్యల హచరీలు, 50పైగా ఫీడ్‌ మిల్లులు, 2లక్షలపైగా రొయ్యల చెరువులు, 250 పైగా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 6వేలకుపైగా పడవలు, నౌకల ద్వారా వేలాదిమందికి జీవనోపాధి లభిస్తోంది. ఏటా ఏప్రిల్‌- సెప్టెంబరు మఽధ్యనే వార్షిక ఉత్పత్తిలో 70ు చేతికి వస్తుంది. అయితే రొయ్యలు త్వరగా పాడయ్యే ఉత్పత్తి. సుంకాల కారణంగా కొంతకాలం సాగునీటి వనరుల్లో నిల్వ చేద్దామంటే తగిన శీతలీకరణ వసతులు లేవు. దీంతో ప్రాసెసింగ్‌ కష్టమై లక్షల మంది ఉపాధిని కోల్పోతారు. ఈ నేపథ్యంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆక్వా భాగస్వాములు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 02:23 AM