గిరిజనుల గుండె గుబిల్లు

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:25 AM

విద్యుత్‌ శాఖ సిబ్బంది నిర్వాకంతో నిరుపేద గిరిజనులకు విద్యుత్‌ బిల్లు వేలాది రూపాయల్లో వచ్చింది. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి ఇప్పుడు బిల్లు వేలాది రూపాయల్లో రావడమేమిటని వారు వాపోతున్నారు.

గిరిజనుల గుండె గుబిల్లు
డోలవానిపాలెంలో వేలాది రూపాయల విద్యుత్‌ బిల్లులు వచ్చాయని చూపుతున్న బాధితులు

- రూ.వేలల్లో విద్యుత్‌ బిల్లులు రావడంతో షాక్‌

రావికమతం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖ సిబ్బంది నిర్వాకంతో నిరుపేద గిరిజనులకు విద్యుత్‌ బిల్లు వేలాది రూపాయల్లో వచ్చింది. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి ఇప్పుడు బిల్లు వేలాది రూపాయల్లో రావడమేమిటని వారు వాపోతున్నారు.

మండలంలోని టి.అర్జాపురం పంచాయతీ శివారు డోలవానిపాలెం గిరిజన గ్రామానికి చెందిన డోలా సత్తిబాబు ఇంట్లో రెండు బల్బులు, టీవీ మాత్రమే ఉన్నాయి. శనివారం విద్యుత్‌ సిబ్బంది వచ్చి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తీశారు. రూ.1.6 లక్షల కరెంట్‌ బిల్లు వచ్చిందని చెప్పి తమకు ఇచ్చి వెళ్లిపోయారని సత్తిబాబు తల్లి లక్ష్మి వాపోయింది. అలాగే గాది నాగరాజుకు రూ.29,913 బిల్లు వచ్చింది. 200 యూనిట్ల వరకు నిరుపేద గిరిజనుల ఇళ్లకు కరెంట్‌ ఉచితమని చెప్పి ఒక్కసారే రూ.వేలల్లో బిల్లు ఇవ్వడమేమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు చేసుకునే తాము ఎలా కట్టగలమని వాపోతున్నారు. ఈ విషయమై ఏపీ ఈపీడీసీఎల్‌ రావికమతం ఏఈ నందన్‌ను సంప్రతించగా సాంకేతిక సమస్య వల్ల బిల్లులు అలా వచ్చాయని, వాటిని సరిచేస్తామని చెప్పారు.

Updated Date - Feb 10 , 2025 | 12:25 AM