అంబేడ్కర్ స్ఫూర్తితో అత్యున్నత స్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:22 AM
Ambedkar's inspiration should rise to the highest level విద్య ద్వారానే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చునని చెప్పడానికి మహనీయుడు అంబేడ్కర్ జీవితం ఉదాహరణ అని, చిన్న కుగ్రామంలో పేదింట జన్మించిన అంబేడ్కర్ విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజల జేజేలు అందుకుంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

అంబేడ్కర్ స్ఫూర్తితో
అత్యున్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నివాళి
విజయనగరం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): విద్య ద్వారానే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చునని చెప్పడానికి మహనీయుడు అంబేడ్కర్ జీవితం ఉదాహరణ అని, చిన్న కుగ్రామంలో పేదింట జన్మించిన అంబేడ్కర్ విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజల జేజేలు అందుకుంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తొలుత అంబేడ్కర్ జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని మన కోసం రూపొందించారన్నారు. నేడు బడుగు, బలహీనవర్గాలకు విద్య, సమానత్వం, రిజర్వేషన్లు, వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే డాక్టరు బీఅర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం చలువేనన్నారు. ఆయన జీవిత చరిత్ర అధ్యయనం చేసి స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందడుగు వేయాలని సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అంబేడ్కర్ సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడన్నారు. సభలో జేసీ సేతుమాధవన్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామానందం, సాంఘిక సంక్షేమశాఖ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల, కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
గజపతినగరం, ఏప్రిల్14(ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవా లని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబేడ్కర్ జయింతిని పురస్కరంచుకొని ముచ్చర్ల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, మాజీ ఎంపీటీసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా ముచ్చర్ల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిన్నారులతో కాసేపు కోలాటం ఆడారు. గ్రామ పెద్దలు కూడా ఆయనతో జత కట్టారు.
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చాలి: మంత్రి
దత్తిరాజేరు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మర్రివలస, వంగర, ఎం.లింగాలవలస గ్రామాల్లో నూనతంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.