Come on.. join రండి.. చేరండి
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:31 PM
Come on.. join తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి.. ఉచితంగా దుస్తులు, మధ్యాహ్న భోజనం, షూష్, పుస్తకాలు పొందండి.. ఆహ్లాదకర వాతావరణంలో ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించేలా చూడండి.. ఆర్భాటపు ప్రకటనలు, అందమైన పాంప్లెట్లు చూసి ప్రైవేటు మోజులో పడకండి.. డబ్బు వృథా చేసుకోకండి.. అంటూ ఉపాధ్యాయులు కోరుతున్నారు.
రండి.. చేరండి
జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్
ఇంటింటికీ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన
తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి.. ఉచితంగా దుస్తులు, మధ్యాహ్న భోజనం, షూష్, పుస్తకాలు పొందండి.. ఆహ్లాదకర వాతావరణంలో ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించేలా చూడండి.. ఆర్భాటపు ప్రకటనలు, అందమైన పాంప్లెట్లు చూసి ప్రైవేటు మోజులో పడకండి.. డబ్బు వృథా చేసుకోకండి.. అంటూ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులతో పాటు మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు సమకూరే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.
రాజాం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల డ్రైవ్ ప్రక్రియ సాగుతోంది. సమగ్ర శిక్ష అధికారులు, ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 4 వేల మంది చిన్నారుల తల్లిదండ్రులను కలిసినట్టు అధికారులు చెబుతున్నారు. మధ్యలో బడి మానేసిన వారిని కూడా కలిసి అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాల గురించి వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు.
వైసీపీ పాలనలో పాఠశాల విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులు ఉండేవి. పూటకో జీవో, రోజుకో ఉత్తర్వుతో విద్యాశాఖను ఇబ్బందికర పరిస్థితిల్లో నెట్టింది. కూటమి సర్కారు వచ్చాక ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. పాత విధానంలోనే మండలానికి ఒక ఎంఈవోను పరిమితం చేయాలని భావిస్తోంది. ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. గతం మాదిరిగా స్కూల్ కాంప్లెక్స్లను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్లో 50 మంది ఉపాధ్యాయులు ఉండేలా చూడాలనుకుంటున్నారు. ఇప్పటివరకూ ప్రతి మండలంలో 10 నుంచి 12 వరకూ స్కూల్ కాంప్లెక్సులుండేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాటి సంఖ్య సగానికి తగ్గే అవకాశం ఉంది.
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1702 ఉండగా 1,13,424 మంది చదువుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకూ 46,965 మంది, 6 నుంచి 10 వరకూ 66,459 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు లేరన్న సాకు చూపి వందలాది పాఠశాలలను సమీప స్కూళ్లలో విలీనం చేశారు. పాఠశాలలతో పాటు తరగతులను వెనక్కి రప్పించే ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ విద్యాసంవత్సరం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయనుంది. మరోవైపు ప్రభుత్వం ముందస్తుగా అడ్మిషన్ డ్రైవ్ పూర్తి చేయాలనుకోవడం విశేషం.
విశేష ఆదరణ..
జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్ కొనసాగుతోంది. ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమగ్ర శిక్ష అధికారులు, సిబ్బంది, విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మాణిక్యాలనాయుడు, డీఈవో, విజయనగరం
Updated Date - Apr 24 , 2025 | 11:31 PM