YS Vivekananda Reddy: అవినాశ్‌ డైరెక్షన్‌ కృష్ణారెడ్డి యాక్షన్‌

ABN, Publish Date - Mar 26 , 2025 | 03:10 AM

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆరేళ్లుగా ప్రారంభం కాకపోవడంతో, ఆయన కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

YS Vivekananda Reddy: అవినాశ్‌ డైరెక్షన్‌ కృష్ణారెడ్డి యాక్షన్‌

వివేకా హత్య కేసును నీరుగార్చే కుట్ర!

సీబీఐ అధికారి రాంసింగ్‌పై తప్పుడు కేసు

కృష్ణారెడ్డిని ఆయన విచారించనేలేదు

బెదిరింపులు, చిత్రహింసలు కట్టుకథలే

సునీత దంపతులపైనా బోగస్‌ కేసు

రిటైర్డ్‌ అదనపు ఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి,

ఏఎ్‌సఐ రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్రధారులు

సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్‌

సీసీ ఫుటేజీ సహా పలు ఆధారాలు సమర్పణ

న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగార్చడానికే సీబీఐ అధికారి రాంసింగ్‌, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కుమార్తె సునీతపై తప్పుడు కేసు బనాయించారని రాష్ట్రప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ ముగ్గురూ తనను హింసించారని, బెదిరించారని వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి, ఆనాటి పులివెందుల సీఐ జి.రాజును విచారించిన తర్వాత.. పులివెందుల పోలీసు స్టేషన్లో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాక.. వివిధ సాంకేతిక అంశాలను విశ్లేషించి, దిగ్ర్భాంతికర విషయాలను సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. వివేకా హత్య కేసును తారుమారు చేసేందుకు వైసీపీ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మార్గదర్శకత్వంలో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, ఏఎ్‌సఐ రామకృష్ణారెడ్డి ప్రయత్నించిన తీరును సోదాహరణంగా వివరించింది. కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు వివరాలతో ప్రస్తుత దర్యాప్తు అధికారి, పులివెందుల ప్రస్తుత డీఎస్పీ బి.మురళి పులివెందుల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు. ఆ నివేదికను రాష్ట్రప్రభుత్వం తన అఫిడవిట్‌కు జతచేసింది. లోతైన దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన అదనపు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని తగు ఆదేశాలు జారీచేయాలని డీఎస్పీ కోర్టును అభ్యర్థించారు.

వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాశ్‌రెడ్డి నిర్దేశం మేరకు రిటైర్డ్‌ అదనపు ఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, ఏఎ్‌సఐ రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని.. రాంసింగ్‌(ఏ-1), నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ-2), సునీత(ఏ-3)లపై తప్పుడు కేసు నమోదు చేశారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా కేసును తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని తెలిపింది. కృష్ణారెడ్డిని రాంసింగ్‌ విచారించనేలేదనడానికి సీసీటీవీ పుటేజ్‌లతోపాటు పలు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. తనను రాంసింగ్‌ హింసించారని.. సునీత, రాజశేఖర్‌రెడ్డి తనను బెదిరించారని ఆయన చేసిన ఆరోపణలన్నీ కట్టుకథలేనని స్పష్టం చేసింది. అఫిడవిట్‌లో ఏమున్నదంటే..


సీఐని బెదిరించి సంతకం చేయించారు..

రాంసింగ్‌, రాజశేఖర్‌రెడ్డి, సునీతపై కేసుకు సంబంధించి మొదట దర్యాప్తు చేసిన జి.రాజు ప్రొఫెషనల్‌గా విచారణ జరుపలేదు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు 2023 డిసెంబరు 15న రాంసింగ్‌, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సునీతలపై వివిధ సెక్షన్ల కింద ఆయన కేసు నమోదుచేశారు. ఆ వెంటనే రిటైర్డ్‌ అదనపు ఎస్పీ రాజేశ్వరరెడ్డి, పులివెందుల ఏఎ్‌సఐ రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. దర్యాప్తును అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రాథమిక చార్జిషీటుకు రూపకల్పన చేశారు. పలువురు సాక్షులను రామకృష్ణారెడ్డి ఇంటికే పిలిపించి.. ల్యాప్‌టా్‌పలో వారి వాంగ్మూలాలు రికార్డుచేశారు. వాటిపై రామకృష్ణారెడ్డి వారితో బలవంతంగా సంతకాలు చేయించారు. ఆ సాక్షుల్లో కొందరు తనకు తెలుసని, అయితే ఈ కేసులో వారినెప్పుడూ తాను విచారించలేదని సీఐ జి.రాజు తాజా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. కేసులో వాస్తవాలను ఎక్కడా బహిర్గతం చేయొద్దంటూ బీసీనైన తనను ఏఎ్‌సఐ, అదనపు ఎస్పీ హెచ్చరించారని, మానసికంగా ఆందోళనకు గురిచేశారని, వాస్తవాలను ఎఫ్‌ఐఆర్‌ ఇండెక్స్‌లో నమోదు చేయొద్దని కూడా ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు. అలాగే క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎ్‌స)లో కూడా సీడీలను అప్‌లోడ్‌ చేయొద్దని వారు హెచ్చరించినట్లు వెల్లడించారు. వివేకా హత్య కేసు తీవ్రతను తగ్గించేందుకు.. ఆ కేసు క్రైం సీనుపై.. పై ముగ్గురిపై పెట్టిన కేసు ముసుగులో రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి చర్చించారు. తద్వారా సీబీఐ దర్యాప్తును తారుమారు చేయడానికి ప్రయత్నించారు. హత్య రోజు క్రైమ్‌ సీను పరిశీలనకు సంబంధించి తొలుత ఏపీ పోలీసులు, తర్వాత సీబీఐ జరిపిన విచారణకు వ్యతిరేకంగా వేరే కథనం సృష్టించి.. భవిష్యత్‌లో జరిగే సీబీఐ కోర్టు ట్రయల్‌లో దానిని తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్ర యత్నించారు. విచారణ పూర్తయ్యాక కేసు డైరీపై సంతకం చేయడానికి రాజు నిరాకరించారు. రామకృష్ణారె డ్డి, రాజేశ్వర్‌రెడ్డి ఆయన్ను ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. తాము చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అక్కడ హెచ్చరించారు. ఒత్తిళ్లకు లొంగి కేసు డైరీపై సంతకం చేశానని ఆ అధికారి వెల్లడించారు. అంతేకాదు.. రాంసింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డి కోర్టును ఆశ్రయిస్తారన్న భయంతో.. కేసు దర్యాప్తు పూర్తికాకముందే హడావుడిగా ప్రాథమిక చార్జిషీటు సైతం దాఖలుచేశారు. ఈ కుట్రలో రాజేశ్వర్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డిలే ప్రధాన పాత్రధారులు.


కృష్ణారెడ్డిని రాంసింగ్‌ ప్రశ్నించలేదు..

రాంసింగ్‌ 2021 ఆగస్టు 12న తనను పులివెందులలోని అర్‌అండ్‌బీ అతిథిగృహానికి పిలిచి.. సునీతారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల పేర్లు చె ప్పాలంటూ తన పాదంపై లాఠీతో కొట్టారని కృష్ణారెడ్డి ఆరోపణ. తన అరుపులను గెస్ట్‌హౌస్‌ డ్రాయింగ్‌ రూం లో ఉన్న 16వ సాక్షి ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కూడా విన్నారని చెప్పారు. అలాగే అదే ఏడాది నవంబరు 30న తన ఇద్దరు కుమారులతో కలిసి కడప సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌ్‌సకు వెళ్లానని.. అక్కడ మళ్లీ శివశంకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు చెప్పాలని.. లేకపోతే జైలుకు వెళ్తావని రాంసింగ్‌ బెదిరించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని కృష్ణారెడ్డి ఆరోపించా రు. నాటి పులివెందుల సీఐ రాజు 2023 డిసెంబరు 15, 17 తేదీల్లో పోలీసు స్టేషన్లో తనను విచారించారని కృష్ణారెడ్డి చెప్పారు. అయితే స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే ఆ తేదీల్లో ఆయన అక్కడకు రానేలేదని తేలింది. విచారణ కోసం 2021 మార్చి 3, 31 తేదీల్లో తనను సీబీఐ ఢిల్లీ పిలిపించిందని.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి చెబితేనే నేరస్థలమైన వివేకా ఇంట్లో బెడ్రూం, బాత్‌రూంలను శుభ్రం చేయడం, వివేకా నుదుటిపై రక్తం తుడిచేయడం.. మృతదేహాన్ని బా త్రూం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పాల్సిందిగా రాంసింగ్‌ అక్కడ తనపై థర్డ్‌ డిగ్రీ, చిత్రహింసలకు గురిచేశారన్నది కృష్ణారెడ్డి చేసిన మరో ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డికి, సునీత కు చెబితే.. సీబీఐకి సహకరిస్తే ఇలాంటి సమస్యలు ఉండవని వా రు అన్నారని తెలిపారు. 2021 అక్టోబరు 18న రాజశేఖర్‌రెడ్డి తనకు ఫోన్‌ చేస్తే హైదరాబాద్‌లోని సునీత, రాజశేఖర్‌రెడ్డిల ఆఫీసుకు వెళ్లానని.. రాజశేఖర్‌రెడ్డి తన 2 ఫోన్లను తీసుకున్నారని.. రాంసింగ్‌ చెప్పినట్లు చేయాలంటూ తనను ఒత్తిడి చేశారని.. తాను తిరస్కరించానని కృష్ణారెడ్డి చెప్పారు. వివేకా భార్య సౌభాగ్యమ్మను కలిస్తే ఆమె తన కారులో తమను కడపకు పంపారని తెలిపారు. అయితే ఇందులో ఒక్క నిజం కూడా లేదు. సీసీటీవీ పుటేజీలు, కాల్‌డేటాను లోతుగా పరిశీలించాక.. సాక్షులను విచారించాక.. కృష్ణారెడ్డి చెప్పిన తేదీల్లో ఆయన పోలీసు స్టేషన్‌కే వెళ్లలేదని తేలింది.


రాంసింగ్‌ గానీ, మరే సీబీఐ అధికారి గానీ ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. పైగా తనను టార్చర్‌కు గురిచేశారని సీబీఐ ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేయలేదు. ఎలకా్ట్రనిక్‌, ప్రింట్‌ మీడియాకు కూడా చెప్పలేదు. గాయపడినట్లు సర్టిఫికెట్లో, ఆ గాయాల ఫొటో లో కూడా చూపలేదు. పులివెందుల గెస్ట్‌హౌ్‌సలో కృష్ణారెడ్డిని రాంసింగ్‌ ఎప్పుడూ విచారించలేదు. 2021 అక్టోబరు 12న ఆయన్ను ప్రశ్నించింది సీబీఐ ఎస్‌ఐ దేవీందర్‌ మీనా. పైగా సీబీఐకి అనువాదకుడిగా వ్యవహరించిన పోలీసు కానిస్టేబుల్‌ కమ్రుద్దీన్‌ సమక్షంలో ఆయన్ను విచారించారు. గెస్ట్‌హౌస్‌ కేర్‌ టేకర్‌, స్వీపర్‌ ఇచ్చిన వాంగ్మూలాలు కూడా కృష్ణారెడ్డి ఆరోపణలను బలపరచడం లేదు. ఆ గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలోనే పోలీసుస్టేషన్‌, కోర్టు, ఆస్పత్రి కూడా ఉన్నాయి. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ కృష్ణారెడ్డి వాటిని ఆశ్రయించిన దాఖలాలులేవు. దేవేంద్ర మీనా వాంగ్మూలం ప్రకారం.. ఆ సమయంలో వివేకా హత్య కేసుకు సంబంధించి రాంసింగ్‌ పులివెందుల కోర్టులో ఉన్నారు. ఆయన గెస్ట్‌హౌ్‌సకు రాలేదని అక్కడి సిబ్బంది కూడా స్పష్టంచేశారు. అలాగే కృష్ణారెడ్డిని రాంసింగ్‌ ఎప్పుడూ ఢిల్లీలో విచారించలేదు. అయితే 2012 మార్చి 10న సీబీఐ డీఎస్పీ దీపక్‌ గౌర్‌, 11, 12 తేదీల్లో ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఏ శుక్లా ఆయన్ను ప్రశ్నించారు. అలాగే రాంసింగ్‌ ఆయన్ను 2021 నపంబరు 31న కడప జైలు గెస్ట్‌హౌ్‌సలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తోట హరికృష్ణ సమక్షంలో విచారించారు. ఆరోజు రాంసింగ్‌ తనను అరగంట పాటు తొడలపైన, చేతులపైనా కొట్టారని చేసిన ఆరోపణలకు కూడా కృష్ణారెడ్డి ఆధారాలు సమర్పించలేదు. ఆయన, పక్క గదిలోనే ఉన్న ఆయన కుమారు లు సదరు గాయాల ఫొటోలను గానీ, మెడికల్‌ సర్టిఫికెట్లు గానీ చూపలేకపోయారు. కృష్ణారెడ్డి లోపలకు వెళ్లేటప్పుడు, బయటకు వచ్చినప్పుడు పూర్తి ఆరోగ్యం తో ఉన్నారని జైలు గెస్ట్‌హౌస్‌ గార్డులు కూడా వాం గ్మూలం ఇచ్చారు. అందుచేత రాంసింగ్‌ ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనడం సత్యదూరం. అలాగే కృష్ణారెడ్డిని రాజశేఖర్‌రెడ్డి, సునీత బెదిరించడారనడానికి ఆధారాల్లేవు. అలాగే కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో తననెప్పుడూ కలవలేదని, తన కారు కూడా ఇవ్వలేదని సౌభాగ్యమ్మ చెప్పారు. అసలా రోజు (2021 అక్టోబరు 18) వారిద్దరూ సునీత ఆఫీసుకే వెళ్లలేదని రుజువైంది.


తన కుమారుడు త్రిలోక్‌రెడ్డికి తమ కుమార్తె ను ఇచ్చి పెళ్లిచేసేందుకు అంగీకరించిన గుంటూరుకు చెందిన అచ్చిరెడ్డిని కూడా రాం సింగ్‌, రాజశేఖర్‌రెడ్డి, సునీత బెదిరించారని, దాంతో పెళ్లి సంబంధం రద్దయిందని కృష్ణారెడ్డి ఆరోపణ చేశారు. ఆ ముగ్గురూ తమను బెదిరించలేదని అచ్చిరెడ్డి, పెళ్లిపెద్ద బొంతు నాగిరెడ్డి స్పష్టం చేశారు. వివేకా హత్యతో కృష్ణారెడ్డికి సంబంధం ఉందని మీడియాలో చూశాక తామే రద్దుచేసుకున్నామన్నారు.

కృష్ణారెడ్డి తాను చేసిన ఆరోపణలకు ఆధారా లు చూపడంలో విఫలమయ్యారు. గత ఏడా ది అక్టోబరు 17న సీఐ రాజును విచారించినప్పుడు.. నేరాలు జరిగినట్లు కృష్ణారెడ్డి చెప్పిన పులివెందుల ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌, కడప సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌, ఢిల్లీ సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లకు గానీ, హైదరాబాద్‌లోని సునీత కార్యాలయానికి గానీ తాను వెళ్లలేదని.. సాక్షులను విచారించలేదని ఆయన తెలియజేశారు. ఈ కేసును రాజు దర్యాప్తు చేయలేదని, అనధికారికంగా రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి నేరపూరిత కుట్రతో, దురుద్దేశపూర్వకంగా తమ చేతుల్లోకి తీసుకుని.. విచారణను తప్పుదోవ పట్టించారని, రికార్డులు తారుమారుచేశారని.. కేసు ఫైలుపైగా బలవంతంగా రాజుతో సంతకాలు చేయించారని స్పష్టమవుతోంది. వివేకా హత్య కేసు నిందితులకు సానుకూలత ఏర్పరచడానికి రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు దుష్ప్రవర్తన కిందకు వస్తుం ది. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 03:10 AM