కోరమాండల్‌ చేతికి నాగార్జున అగ్రికెమ్‌

ABN, Publish Date - Mar 13 , 2025 | 04:55 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (గతంలో నాగార్జున అగ్రికెమ్‌) యాజమాన్యం చేతులు మారింది. మురుగప్ప గ్రూప్‌నకు చెందిన...

కోరమాండల్‌ చేతికి నాగార్జున అగ్రికెమ్‌

త్వరలో 26 శాతం ఓపెన్‌ ఆఫర్‌

రూ.820 కోట్లకు 5% వాటా కొనుగోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (గతంలో నాగార్జున అగ్రికెమ్‌) యాజమాన్యం చేతులు మారింది. మురుగప్ప గ్రూప్‌నకు చెందిన ఎరువుల కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ రూ.820 కోట్లతో ఎన్‌ఏసీఎల్‌ ఈక్విటీలో 53.13 శాతం వాటా కొనుగోలు చేసింది. ఎన్‌ఏసీఎఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రమోటర్ల నుంచి ఈ వాటాను ఒక్కో షేరు రూ.76.7 చొప్పున కొనుగోలు చేసినట్టు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ బుధవారం రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. దీనికి సంబంధించిన ఒప్పందానికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపింది. దీంతో మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం కంపెనీ త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించబోతోంది. ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాల మార్కెట్‌లో తన స్థానాన్ని నాగార్జున అగ్రికెమ్‌ కొనుగోలు మరింత పటిష్ఠం చేస్తుందని మురుగప్ప గ్రూప్‌ భావిస్తోంది.


నాగార్జున అగ్రికెమ్‌ తయారు చేసే యాక్టివ్‌ ఇంగ్రిడియంట్స్‌, కెమికల్‌ కాంపౌండ్స్‌ను వరి, మొక్కజొన్న, ఆలు పంటల క్రిమి సంహారక, కలుపు మందుల తయారీలో ఉపయోగిస్తారు. నాగార్జున అగ్రికెమ్‌ ఈక్విటీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 63.65 శాతం వాటా ఉంది. ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీ్‌సకు ఏపీతో పాటు గుజరాత్‌లోనూ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది. ఈ అమ్మకంతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాగార్జున గ్రూప్‌ తన ప్రధాన వ్యాపారాల నుంచి దాదాపుగా వైదొలగినట్టయింది.

Read Also : Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

Updated Date - Mar 13 , 2025 | 04:55 AM