Trump Tariffs Crash Markets: మహా పతనం
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:01 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు రక్తపాతం చెందాయి. భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూసి, రూ.14 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాల్
వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే
ఓ దశలో 5 శాతం పతనమైన భారత సూచీలు
ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,939 పాయింట్ల పతనం
2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్
అదే బాటలో నిఫ్టీ.. 742.85 పాయింట్ల నష్టం
క్షణాల్లో రూ.20లక్షల కోట్ల సంపద ఆవిరి
ట్రేడింగ్ ముగిసేసరికి రూ.14 లక్షల కోట్ల నష్టం
భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు
బ్రహ్మాండంగా ఉంది.. ద్రవ్యోల్బణమే లేదు!
చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి: ట్రంప్
ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకపోతే
చైనాపై 50% అదనపు సుంకం
ఒక్కరోజే గడువు.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక
ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి. జపాన్ మొదలు.. అమెరికా దాకా.. అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వాల్స్ట్రీట్ మొదలు.. దలాల్స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ ‘బేర్’మన్నాయి. రక్తపాతం జరిగిందా? అన్నట్లుగా ‘బ్లాక్ మండే’ రోజున సూచీలన్నీ ఎరుపెక్కాయి.
అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఓ దశలో 5%(3,939 పాయింట్లు) వరకు నష్టపోయింది. ట్రేడింగ్ చివర్లో వాల్యూ బైయింగ్ కొనుగోళ్లతో 1,700 పాయింట్ల వరకు కోలుకుని 3%(2,226 పాయింట్లు) నష్టంతో 73,137.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 742 పాయింట్ల నష్టంతో రూ.22,161 పాయింట్ల వద్ద క్లోజైంది. మార్కెట్ల భారీ పతనంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.389.25 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ప్రారంభంలో ఈ నష్టం రూ.20లక్షల కోట్లుగా ఉండగా.. మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకుంది. గడిచిన పది నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలను చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 13.6% నష్టపోయాయి. ఈ కోవలో వరుసగా తైవాన్(9.6%), జపాన్(9.5%), ఇటలీ(8.4%), సింగపూర్(8%) మేర పతనమయ్యాయి. స్వీడన్, చైనా, స్విట్జర్లాండ్ సూచీలకు కూడా 7% మేర నష్టం వాటిల్లింది.
మరింత కిందికే..!
మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా తన 34% శాతం ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను ప్రస్తుత 34 నుంచి 50 శాతానికి పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగాహెచ్చరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పతనానికి ఇప్పట్లో విరామం ఉంటుందనే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది అక్టోబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ‘‘కమల గెలిస్తే.. మార్కెట్లు ఎరుపెక్కుతాయి. 1926 నాటి మాంద్యం తిరిగి వస్తుంది’’ అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే..! కమల గెలవకున్నా.. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినా.. సుంకాల విధింపుతో మార్కెట్లు ఎరుపెక్కడం గమనార్హం..! మంగళవారం స్వల్పకాలానికి నిఫ్టీకి 21,700 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తోందని, అది కూడా బ్రేకయితే 21,000 దిగువకు కూడా చేరే ప్రమాదం ఉందని సాంకేతిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పాంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఆంధ్రుడి ప్రతిభ
Read Latest and International News