Donald Trump: భారత్‌కు ట్రంప్‌ ఝలక్‌

ABN, Publish Date - Feb 26 , 2025 | 04:47 AM

రహస్యంగా ఇరాన్‌ పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, అమ్మకాల బ్రోకరింగ్‌ నిర్వహిస్తున్నారంటూ 30 మంది వ్యక్తులపైనా, నౌకలు, సంస్థలపైనా అమెరికా ఆర్థిక, విదేశాంగశాఖలు తాజాగా ఆంక్షలు విధించాయి.

Donald Trump: భారత్‌కు ట్రంప్‌ ఝలక్‌

మన దేశానికి వ్యతిరేకంగా ఒకేసారి రెండు నిర్ణయాలు

భారత్‌లోని కొన్ని సంస్థలు, నౌకలపై తాజా ఆంక్షలు

ఇంధన ట్యాంకర్ల ఆపరేటర్లు, మేనేజర్లపై కూడా

ఇరాన్‌కు సహకరిస్తున్నారని ఆరోపణ

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు వ్యతిరేకంగా తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రహస్యంగా ఇరాన్‌ పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, అమ్మకాల బ్రోకరింగ్‌ నిర్వహిస్తున్నారంటూ 30 మంది వ్యక్తులపైనా, నౌకలు, సంస్థలపైనా అమెరికా ఆర్థిక, విదేశాంగశాఖలు తాజాగా ఆంక్షలు విధించాయి. భారత్‌, చైనాలోని ట్యాంకర్ల ఆపరేటర్లు, మేనేజర్లు, యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), హాంకాంగ్‌లోని ఇంధన బ్రోకర్లు, ఇరాన్‌కు చెందిన నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ అధినేత కూడా ఈ ఆంక్షల జాబితాలో ఉన్నారు. ఇరాన్‌కు చెందిన కోట్లాది బ్యారెళ్ల ముడి చమురును ఈ నౌకలు రవాణా చేస్తున్నాయని, ఆ చమురు విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అమెరికా ఆర్థికశాఖ తెలిపింది. ‘ఇరాన్‌ చమురుకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తించే ఎవరికైనా ఆంక్షల ముప్పు తప్పదు’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సంట్‌ తేల్చిచెప్పారు.



ఆంక్షలు ఈ సంస్థలపైనే...

అమెరికా తాజాగా ఆంక్షలు విధించిన సంస్థల్లో భారత్‌కు చెందిన బీఎంఎస్‌ మెరైన్‌ లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌, ఆస్టిన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కాస్మోస్‌ లైన్స్‌ ఇన్క్‌ ఉన్నాయి. ఈ సంస్థలు రహస్యంగా ఇరాన్‌కు చెందిన పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌, రవాణా, అమ్మకాలను నిర్వహిస్తున్నాయనేది అమెరికా ఆరోపణ. దీంతోపాటు భారత్‌కు చెందిన ఫ్లక్స్‌ మారిటైమ్‌ ఎల్‌ఎల్‌పీ సాంకేతిక మేనేజర్‌లా వ్యవహరిస్తూ లక్షల బ్యారెళ్ల ఇరాన్‌ ముడి చమురును ఒక నౌక నుంచి మరో నౌకకు మళ్లించే కార్యకలాపాలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది.

ఇరాన్‌ను ఆర్థిక దిగ్బంధనం చేసేందుకే..

ఇరాన్‌పై గరిష్ఠంగా ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చేలా అమెరికా ఆర్థికశాఖ మంత్రిని ఆదేశిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ఈనెల మొదట్లో ట్రంప్‌ సంతకం చేశారు. ఇరాన్‌ ఇంధన ఎగుమతులు శూన్యం కావాలని అందులో ఆదేశించారు. ఇరాన్‌ అణ్వాయుధ దేశంగా అభివృద్ధి చెందకూడదని ట్రంప్‌ తేల్చిచెప్పారు. అమెరికా నుంచి తీవ్రమైన ఆంక్షలు ఉన్నప్పటికీ ఇంధన ఎగుమతుల ద్వారా 2022లో రూ.4.7 లక్షల కోట్లు(54 బిలియన్‌ డాలర్లు), 2023లో రూ.4.6 లక్షల కోట్లను ఇరాన్‌ ఆర్జించినట్టు అమెరికా అంచనా వేసింది.



విదేశీ సాయం నిలిపేసినా.. పాక్‌కు నిధులు

అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం రూ.3,461 కోట్ల(397 మిలియన్‌ డాలర్ల) నిధులను అమెరికా తాజాగా మంజూరు చేసింది. అమెరికా పర్యవేక్షణ కార్యక్రమం కింద ఈ నిధులను ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు ఉపయోగించాలని, ఆ నిధులను భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించకూడదని అమెరికా తేల్చిచెప్పినట్టు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తాజాగా కథనం ప్రచురించింది. జనవరి 20 అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ సాయాన్ని ట్రంప్‌ నిలిపివేసినప్పటికీ పాకిస్థాన్‌కు తాజాగా నిధులు విడుదల చేయడం గమనార్హం. ఉగ్రవాదంపై తగిన చర్యలు చేపట్టడం లేదంటూ 2018లో పాకిస్థాన్‌కు రక్షణ సాయాన్ని ట్రంప్‌ నిలిపివేశారు. ఆ నిర్ణయాన్ని బైడెన్‌ ప్రభుత్వం ఉపసంహరించుకొంది.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:50 AM