IIT Guwahati: సరిహద్దుల్లో ఏఐ రోబోలతో నిఘా
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:31 AM
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ రోబోలు బోర్డర్లో నిరంతరం కాపలా కాస్తుంటాయి. అలాగే సైన్యం కూడా వెళ్లలేని క్లిష్టమైన, సవాళ్లతో కూడిన భూభాగాల్లోనూ రియల్టైమ్లో పర్యవేక్షణ చేస్తాయి.

న్యూఢిల్లీ, మార్చి 23: భారత సరిహద్దులను పర్యవేక్షించడానికి ఐఐటీ గువాహటి పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ రోబోలు బోర్డర్లో నిరంతరం కాపలా కాస్తుంటాయి. అలాగే సైన్యం కూడా వెళ్లలేని క్లిష్టమైన, సవాళ్లతో కూడిన భూభాగాల్లోనూ రియల్టైమ్లో పర్యవేక్షణ చేస్తాయి. ఐఐటీ గువాహటిలోని స్టార్టప్ డీఏ స్పాటియో రోబోటిక్ లేబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (డీఎ్సఆర్ఎల్) అభివృద్ధి చేసిన ఈ రోబోలను భారత రక్షణ వ్యవస్థలోకి తీసుకునేందుకు డీఆర్డీవో అనుమతి కూడా లభించింది. నిఘా వ్యవస్థ కోసం భారత సైన్యం ఇప్పటికే వీటికి క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహిస్తోంది. మానవ గస్తీపై ఆధారపడే సంప్రదాయ భద్రతా చర్యలకు భిన్నంగా ఈ రోబోలు ఎలాంటి భూభాగంలోనైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయని డీఎ్సఆర్ఎల్ సీఈవో అర్నబ్ కుమార్ బర్మన్ తెలిపారు. దుండగులు అంతర్జాతీయ సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించినా, డ్రోన్లను పంపినా.. ఈ రోబోలకు ఉన్న సెన్సర్లు వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తాయన్నారు.