Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన
ABN, Publish Date - Feb 13 , 2025 | 07:52 PM
Manipur: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

మణిపూర్, ఫిబ్రవరి 13: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. 2023, మేలో రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 250 మందికిపైగా ప్రజలు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు దశల వారీగా తమ మద్దతు ఉప సంహరించుకొన్నాయి. అదీకాక.. ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు సొంత పార్టీ.. బీజేపీలోని ఎమ్మెల్యేలు సైతం బీరెన్ సింగ్పై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఇక ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో సీఎం బీరెన్ సింగ్పై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం ఆయన మణిపూర్ చేరుకుని..తాను సీఎం పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమిస్తారంటూ ఓ చర్చ సైతం సాగింది. మరోవైపు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ ప్రచారం నడిచింది. చివరగా రాష్ట్రపతి పాలన విధించడంపైనే కేంద్రం మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ నిర్ణయం తీసుకుంది.
For National News And Telugu News
Updated Date - Feb 13 , 2025 | 07:55 PM