Waqf Amendment Act 2025: అమల్లోకి వక్ఫ్ సవరణ చట్టం
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:24 AM
వక్ఫ్ సవరణ చట్టం 2025 మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం నోటిఫై చేసింది. వక్ఫ్ చట్టంపై వ్యాజ్యాలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది కేంద్రం.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టం (యాక్ట్ 14 ఆఫ్ 2025)లోని నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. మరోవైపు వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని కోరుతూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా, కాంగ్రె్సవి ముస్లింలను ప్రసన్నం చేసుకునే రాజకీయాలని, 2013లో యూపీఏ తీసుకువచ్చిన వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలు వివక్షకు గురయ్యారని ప్రధాని మోదీ అన్నారు. పాత వక్ఫ్ చట్టంతో పేద పస్మండ ముస్లింలకు ఒరిగిందేమీ లేదన్నారు. ‘‘యూపీఏ వక్ఫ్తో ల్యాండ్ మాఫియా, ఛాందసవాదులకు భూములను ఆక్రమించుకునే వెసులుబాటు కలిగింది’’ అని విమర్శించారు.