పంజాబ్‌కు ఝలక్‌

ABN, Publish Date - Apr 06 , 2025 | 05:00 AM

ఐపీఎల్‌లో జోరు మీదున్న పంజాబ్‌ కింగ్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67) సీజన్‌లో తొలిసారి మెరవగా...

పంజాబ్‌కు ఝలక్‌
  • రాజస్థాన్‌ ఘన విజయం

  • జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ

  • కట్టడి చేసిన బౌలర్లు

చండీగఢ్‌: ఐపీఎల్‌లో జోరు మీదున్న పంజాబ్‌ కింగ్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67) సీజన్‌లో తొలిసారి మెరవగా.. పేసర్‌ ఆర్చర్‌ (3/25) పదునైన బౌలింగ్‌తో దెబ్బతీశాడు. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది రెండో గెలుపు కాగా.. పంజాబ్‌కు మూడు మ్యాచ్‌ల్లో తొలి ఓటమి. ముందు గా రాజస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 నాటౌట్‌), సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 6 ఫోర్లతో 38) రాణించారు. ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 రన్స్‌ చేసి ఓడింది. నేహల్‌ వధేరా (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62), మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) ఆకట్టుకున్నారు. సందీప్‌, తీక్షణలకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఆర్చర్‌ నిలిచాడు.


తొలి ఓవర్‌లోనే షాక్‌: భారీ ఛేదనలో పంజాబ్‌ బ్యాటర్‌ నేహల్‌ వధేరా మాత్రమే పోరాడాడు. మ్యాక్స్‌వెల్‌ కాస్త సహకరించినా మిగతా వారంతా తీవ్రంగా నిరాశపరిచారు. పేసర్‌ ఆర్చర్‌ బుల్లెట్‌లాంటి బంతులతో తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రియాన్ష్‌ (0), కెప్టెన్‌ శ్రేయాస్‌ (10)లను బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే స్టొయినిస్‌ (1)ను సందీప్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయడంతో పంజాబ్‌ 26/3 స్కోరుతో కష్టాల్లో పడింది. అటు బంతికో పరుగు చొప్పున సాధించిన మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (17) ఏడో ఓవర్‌లో వెనుదిరగగా.. నేహల్‌, మ్యాక్స్‌వెల్‌ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే మధ్య ఓవర్లలో రాయల్స్‌ బౌలర్లు కట్టడి చేశారు. పదో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ 6,4, నేహల్‌ 6తో 19 రన్స్‌ వచ్చాయి. ఈ జోడీ అడపాదడపా బౌండరీలు సాధించడంతో పంజాబ్‌ విజయంపై ఆశలు పెట్టుకుంది. 33 బంతుల్లో ఓ సిక్సర్‌తో నేహల్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేశాడు. కానీ వరుస ఓవర్లలో మ్యాక్స్‌వెల్‌ను తీక్షణ.. నేహల్‌ను హసరంగ అవుట్‌ చేశారు. వీరి మధ్య ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అప్పటికి చివరి 4 ఓవర్లలో 70 రన్స్‌ కావాల్సి ఉండడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు.

జైస్వాల్‌ అదుర్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ అదరగొట్టింది. అలాగే రియాన్‌ పరాగ్‌ డెత్‌ ఓవర్లలో వేగం కనబర్చడంతో జట్టు స్కోరు 200 దాటింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఈసారి స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. మరో ఓపెనర్‌ శాంసన్‌ సైతం రాణించడంతో ఆరంభంలో పంజాబ్‌ బౌలర్లు ఇబ్బందిపడ్డారు. నాలుగో ఓవర్‌లో జైస్వాల్‌ రెండు సిక్సర్లతో 19 రన్స్‌ సమకూరాయి. అలాగే ఈ సీజన్‌లో వికెట్‌ కోల్పోకుండా రాజస్థాన్‌ పవర్‌ప్లేలో 53 పరుగులతో నిలిచింది. చక్కగా కుదురుకున్న శాంసన్‌ను 11వ ఓవర్‌లో ఫెర్గూసన్‌ అవుట్‌ చేయగా తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక చాహల్‌ ఓవర్‌లో జైస్వాల్‌ 4,6తో 40 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.


ఆ తర్వాత 13వ ఓవర్‌లో జైస్వాల్‌ 6,4, పరాగ్‌ 4తో 17 రన్స్‌ వచ్చాయి. కానీ వరుస ఓవర్లలో రాజస్థాన్‌.. జైస్వాల్‌, నితీశ్‌ రాణా (12) వికెట్లను కోల్పోయింది. ఇక చివరి ఐదు ఓవర్లలో వేగం పెంచిన పరాగ్‌కు హెట్‌మయెర్‌ (20) జత కలిశాడు. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు సాధించిన పరాగ్‌.. జాన్సెన్‌ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో చెలరేగాడు. అయితే అదే ఓవర్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను జాన్సెన్‌ అందుకోలేకపోయాడు. 19వ ఓవర్‌లో హెట్‌మయెర్‌ అవుటైనా.. చివరి ఓవర్‌లో పరాగ్‌ 6. జురెల్‌ (13 నాటౌట్‌) 6,4 కారణంగా 19 రన్స్‌ రావడంతో రాజస్థాన్‌ భారీ స్కోరందుకుంది.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (బి) ఫెర్గూసన్‌ 67, శాంసన్‌ (సి) శ్రేయాస్‌ (బి) ఫెర్గూసన్‌ 38, రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 43, నితీశ్‌ రాణా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) జాన్సెన్‌ 12, హెట్‌మయెర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) అర్ష్‌దీప్‌ 20, జురెల్‌ (నాటౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 205/4; వికెట్ల పతనం: 1-89, 2-123, 4-138, 4-185; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-35-1, జాన్సెన్‌ 4-0-45-1, ఫెర్గూసన్‌ 4-0-37-2, మ్యాక్స్‌వెల్‌ 1-0-6-0, చాహల్‌ 3-0-32-0, స్టొయినిస్‌ 4-0-48-0.


పంజాబ్‌: ప్రియాన్ష్‌ ఆర్య (బి) ఆర్చర్‌ 0, ప్రభ్‌సిమ్రన్‌ (సి) హసరంగ (బి) కార్తికేయ 17, శ్రేయాస్‌ అయ్యర్‌ (బి) ఆర్చర్‌ 10, స్టొయినిస్‌ (సి అండ్‌ బి) సందీప్‌ 1, నేహల్‌ వధేరా (సి) జురెల్‌ (బి) హసరంగ 62, మ్యాక్స్‌వెల్‌ (సి) జైస్వాల్‌ (బి) తీక్షణ 30, శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 10, సుయాన్ష్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) సందీప్‌ 2, జాన్సెన్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) తీక్షణ 3, అర్ష్‌దీప్‌ (సి) హసరంగ (బి) ఆర్చర్‌ 1, ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 155/9; వికెట్ల పతనం: 1-0, 2-11, 3-26, 4-43, 5-131, 6-131, 7-136, 8-145, 9-151; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-25-3, యుధ్‌వీర్‌ 2-0-20-0, సందీప్‌ శర్మ 4-0-21-2, తీక్షణ 4-0-26-2, కుమార్‌ కార్తికేయ 2-0-21-1, హసరంగ 4-0-36-1.

1

రాజస్థాన్‌కు ఎక్కువ విజయాలు (32) అందించిన కెప్టెన్‌గా శాంసన్‌. వార్న్‌ (31)ను అధిగమించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 05:00 AM