యూరియా వచ్చేసింది..
ABN, Publish Date - Mar 13 , 2025 | 11:56 PM
జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉండడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పినట్లయింది. వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో యాసంగి సీజన్లో యూరియా కొరత లేదు.
- యాసంగి సీజన్కు సరిపడా నిల్వలు
- ముందస్తు జాగ్రత్తలతో తప్పిన తిప్పలు
- జిల్లాలో లక్షా 13వేల ఎకరాల్లో వరిసాగు
మంచిర్యాల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉండడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పినట్లయింది. వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో యాసంగి సీజన్లో యూరియా కొరత లేదు. మార్క్ఫెడ్తో పాటు ప్రైవేట్ మార్కెట్లోనూ యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయి. మరో పదిరోజుల్లో రైతులు చివరి డోస్ వేయనుండగా ఆ మేరకు సరిపడా యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉంది.
- విడతల వారీగా...
యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో లక్షా 13వేల 602 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. పంటకు సంబంధించి ఈ సీజన్లో పదివేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా విడతల వారీగా పూర్తి స్థాయిలో సకాలంలో జిల్లాకు స్టాకు చేరడంతో ఇబ్బందులు తలెత్తలేదు. దీనికి తోడు నీటి నిల్వలు కూడా సరిపడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం సన్నరకం వడ్లను ప్రోత్సహిస్తుండడంతో రైతులు ఆ దిశగా ఉత్సాహం కనబరుస్తున్నారు. దీనికితోడు ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారులు యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా కొరత లేకుండా ఉండేందుకు దోహదపడింది.
- ఇతర జిల్లాలకు సరఫరా...
జిల్లాలో సాగవుతున్న యాసంగి వరి సీజన్లో సరిపడా యూరియా పోను మిగిలిన స్టాకును వ్యవసాయ శాఖ అధికారులు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు జగిత్యాల జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, నిర్మల్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, ఆదిలాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులను సరఫరా చేశారు. సకాలంలో సరిపడ స్టాక్ రావడంతోనే జిల్లా అవసరాలు పోను ఇతర జిల్లాకు ఎగుమతిచేసే అవకాశం కలిగిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. యాసంగి సీజన్ చివరిడోసు వేసేందుకు సమయం ఆసన్నమైనందున ఆ మేరకు నిల్వలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నుల వరకు స్టాక్ ఉండగా మార్క్ఫెడ్లో 800 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. దీంతో పాటు ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులు జిల్లాలో 224 ఉండగా వాటిలోనూ పుష్కలంగా నిల్వ ఉండడంతో యాసంగి సీజన్లో యూరియా కొరత వచ్చే పరిస్థితి లేదు.
- వినియోగంపై రైతులకు అవగాహన..
వరి సాగుకు అవసరమయ్యే యూరియా వినియోగంపై రైతులకు వ్యవసాయశాఖ అధికారులు తరుచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం సత్ఫలితాలను ఇచ్చింది. పంటకు ఎంత మోతాదు అవసరమో అంతే వేసేలా అవగాహన కల్పించారు. దీంతో అధిక యూరియా వినియోగాన్ని అరికట్టడంతో యాసంగి సీజన్లో కొరత లేకుండా సర్ధుబాటు అయినట్లు అధికారులు చెబుతున్నారు. మూడు సంవత్సరాలుగా జిల్లాలో యూరియా కొరత లేకపోవడం అధికారుల కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే ఫర్టిలైజర్షాపులు సిండికేటుగా మారి అధిక ధరలకు యూరియా విక్రయించకుండ చర్యలు చేపట్టారు. దీంతో ఎంఆర్పీ రేటు రూ. 290కే బస్తా రైతులకు లభించింది.
పటిష్ట పర్యవేక్షణతోనే...
- జి కల్పన, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
యాసంగి సీజన్లో సుమారు 40వేల మంది రైతులు వరిసాగు చేశారు. మొత్తం లక్షా 13వేల పై చిలుకు ఎకరాల్లో వరి సాగు చేయగా పదివేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం వచ్చింది. పంటకు యూరియా చల్లేనాటికి అవసరం మేరకు స్టాక్ వచ్చేలా చర్యలు తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడలేదు. మరో పది రోజుల్లో సీజన్ చివరి డోస్ కూడా వేయనుండగా ఆ మేరకు సరిపడా యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. భూసార పరీక్షలు చేయించిన అనంతరం రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఎప్పటికప్పుడు యూరియా నిల్వలపై పటిష్ట పర్యవేక్షణ చేయడంతో కొరత తలెత్తలేదు.
Updated Date - Mar 13 , 2025 | 11:57 PM