అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధికి నిధుల మంజూరు చేయండి

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:42 PM

నగరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌ కోరారు.

 అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధికి నిధుల మంజూరు చేయండి
కేంద్ర మంత్రి మన్సూక్‌ మాండవీయకు వినతి పత్రం అందిస్తున్న బండిసంజయ్‌కుమార్‌

- కేంద్రమంత్రిని కోరిన బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, కేంద్రం అమలు చేస్తున్న ఇతర పథకాల ద్వారా కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఫ కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజి (న్యాయ కళాశాల)కు అనుమతి ఇవ్వాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌కు బండి సంజయ్‌కుమార్‌ వినతి పత్రం అందించారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో వచ్చే విద్యాసంవత్సరానికి గాను 120 మందితో ( రెండు సెక్షన్లు) కళాశాలను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్చువల్‌ ద్వారా తనిఖీ నిర్వహించి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వివరణలతో కూడిన నివేదిక కోరిందన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకు వివరాణాత్మక నివేదికను పంపామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల లా కోర్సుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీకి సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. 2025-26 సంవత్సరం నుంచే లా కళాశాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ సునీల్‌రావు, శాతవాహన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఉమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:42 PM