స్టాక్ మార్కెట్ లావాదేవీలకు టీడీఎస్ మినహాయింపు
ABN , First Publish Date - 2021-07-05T07:00:24+05:30 IST
షేర్లు, కమోడిటీస్ లావాదేవీలను మూలంలో పన్ను కోత (టీడీఎస్) నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది. అయితే ఇది గుర్తింపు పొందిన స్టాక్

న్యూఢిల్లీ: షేర్లు, కమోడిటీస్ లావాదేవీలను మూలంలో పన్ను కోత (టీడీఎస్) నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది. అయితే ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీ లేదా కమోడిటీస్ ఎక్స్ఛేంజీల ద్వారా జరిగే లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఐటీ చట్టంలోని 194 క్యూ సెక్షన్ ప్రకారం ఏదైనా వ్యాపార లావాదేవీ విలువ రూ.50 లక్షలు మించితే.. ఆ లావాదేవీ విలువలో 0.1 శాతాన్ని కొనుగోలుదారుడు.. అమ్మకందారుడి నుంచి టీడీఎస్ కింద మినహాయించుకుని ఐటీ శాఖకు చెల్లించాలి. ఈ లావాదేవీ జరిగేందుకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.10 కోట్లకు పైబడి టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఇది వర్తిస్తుందని బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకనుగుణంగా ఐటీ శాఖ ఈ నెల 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే టీడీఎస్ కారణంగా స్టాక్ మార్కెట్, కమోడిటీస్ ట్రేడింగ్లో సమస్యలు వస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఐటీ శాఖ ఈ చర్య తీసుకుంది.