సీఎంను దింపే అవసరం నాకులేదు
ABN , First Publish Date - 2021-09-17T09:17:52+05:30 IST
సీఎంను దింపాలని తాను కుట్ర చేసినట్లు మంత్రి హరీశ్రావు అంటున్నారని, అల్లుడుగా ఆయనకు, కొడుకుగా కేటీఆర్కు, బిడ్డగా కవితకు ఆ అవసరం ఉంటుందేమోగాని

- అల్లుడు, కొడుకు, బిడ్డకు ఉంటుందేమో
- మాజీ మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట, సెప్టెంబరు 16: సీఎంను దింపాలని తాను కుట్ర చేసినట్లు మంత్రి హరీశ్రావు అంటున్నారని, అల్లుడుగా ఆయనకు, కొడుకుగా కేటీఆర్కు, బిడ్డగా కవితకు ఆ అవసరం ఉంటుందేమోగాని తనకుకాదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గురువారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాడూ ఇటువైపు చూడనివారు తాను రాజీనామా చేసినప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ తనపై కక్షకట్టి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు హుజూరాబాద్లో వడ్డీ లేని రుణాలు, దళితబంధు, పెన్షన్లు, రేషన్ కార్డులు, కురుమ, యాదవ, ముదిరాజ్ సంఘం భవనాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. తాను అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారని, ఒక్కసారి వీణవంక రైతుల వద్దకు వచ్చి అడిగితే చెప్తారన్నారు. నియోజకవర్గంలో అన్ని వాగుల మీద వంతెనలు కట్టించానని, ప్రతి ఊరికి రోడ్డు వేయించానన్నారు. దళితులకు రూ. 10లక్షలు ఇచ్చారు, బీసీలకు కూడా రూ.50వేలు ఇస్తారట, అవి తీసుకోండి, దీనికి కారణమైన ఈటల రాజేందర్ను మాత్రం మర్చిపోకండి అని కోరారు.