Ayodya Temple : రామమందిరమే ప్రచారాస్త్రం
ABN , Publish Date - Dec 25 , 2023 | 01:54 AM
ఈ నెల 30న.. ప్రధాని మోదీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కణ్నుంచీ 15 కిలోమీటర్ల మేర రోడ్షోగా వెళ్లి.. పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ని ప్రారంభించి, వందేభారత్, అమృత్భారత్ రైళ్లకు జెండా ఊపుతారు! ఆనక.. మళ్లీ ...

2024 ఎన్నికల్లో అసాధారణ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా కమలనాథుల వ్యూహాలు
నెలాఖరులో అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభం.. మోదీ భారీ బహిరంగ సభ
రామమందిర నిర్మాణంపై బుక్లెట్
పార్టీ పదాధికారుల భేటీలో నిర్ణయాలు
10% మేర ఓట్లు పెంచుకోవడమే లక్ష్యం
న్యూఢిల్లీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 30న.. ప్రధాని మోదీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కణ్నుంచీ 15 కిలోమీటర్ల మేర రోడ్షోగా వెళ్లి.. పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ని ప్రారంభించి, వందేభారత్, అమృత్భారత్ రైళ్లకు జెండా ఊపుతారు! ఆనక.. మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు! ఆ తర్వాత.. జనవరి 22న అయోధ్యలో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవం జరుగుతుంది! ఆ కార్యక్రమం జరిగిన కొద్దిరోజులకే.. ఆ వేడుకల తాలూకూ సందడి ఇంకా దేశ ప్రజల హృదయాల నుంచి చెరిగిపోకముందే.. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుంది! రామమందిరమే ప్రధాన ప్రచారాస్త్రంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. దానికి అనుగుణంగా అత్యంత చాకచక్యంగా రూపొందించుకున్న ఎన్నికల ప్రణాళిక ఇది. ఈమేరకు.. రామమందిర ప్రారంభాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ బీజేపీ ఒక బుక్లెట్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రామమందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర, ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషి గురించి వివరిస్తూనే.. ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయనే వివరాలన్నింటినీ ఆ బుక్లెట్లో రూపొందిస్తున్నారు. తద్వారా మరింతమంది కొత్త ఓటర్లను ఆకర్షించి.. పార్టీ ఓటింగ్ శాతాన్ని కనీసం పది శాతం మేర పెంచుకోవాలని గతవారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 50ు ఓటింగ్ సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించారు. ‘‘2024లో అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే మన లక్ష్యం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ప్రకటించారు. బీజేపీకి బలహీనమైన నియోజకవర్గాలంటూ ఉండబోవని.. అన్నింటినీ గెలిచే నియోజకవర్గాలుగానే భావించి, కష్టించి, విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు దిమ్మెరపోయేలా 2024 విజయం అన్ని రికార్డులనూ బద్దలుగొట్టాలన్నారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేంతవరకూ వేచిచూడాల్సిన అవసరం లేదని.. వెంటనే ప్రచార రంగంలోకి దూకాలని సమావేశంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ సిద్ధాంతం, బీజేపీ నెరవేర్చిన చరిత్రాత్మక కర్తవ్యాలు, మోదీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని.. మోదీని అసాధారణ మెజారిటీతో మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కాక.. పార్టీ ఏం చేసిందో చెప్పడమే ప్రచారంలో ప్రధానంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తొలిసారి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించాలని సూచించారు.
అయోధ్య రాముడికి నేపాల్ కానుకలు!
అయోధ్య రాముడికి నేపాల్ ప్రత్యేక కానుకలు అందజేయనుంది. వచ్చే నెలలో అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో పాటు అభరణాలు, పట్టువస్త్రాలు, పాత్రలు, స్వీట్లను అందించబోతున్నట్లు నేపాల్ మీడియా తెలిపింది. జనవరి 18న జనక్పూర్ధం నుంచి సాగే అయోధ్య ధామ్ యాత్ర 20న అయోధ్యలో ముగియనుంది. అదే రోజున ఈ ప్రత్యేక కానుకలను శ్రీరామ జన్మభూమి రామమందిరం ట్రస్ట్కు అందజేస్తామని నేపాల్లోని జానకి మాత ఆలయానికి చెందిన రాంరోషన్దా్స వైష్ణవ్ తెలిపారు. జనవరి 22న అయోధ్యలో పవిత్రోత్సవం నిర్వహించనున్నారు. నేపాల్లోని గండకీ నది నుంచి తెచ్చిన సాలిగ్రామ శిలలపై చెక్కిన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు.