Pulses : భారత్లో పప్పుల కొరత!
ABN , First Publish Date - 2023-09-28T03:16:06+05:30 IST
భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం నేపథ్యంలో గతవారం నుంచి భారత్కు కెనడా నుంచి పప్పుల దిగుమతులు మందగించాయి. దీని వల్ల కెనడాలోని రైతులకు పప్పుల ధరల్లో కోతపడే ప్రమాదం ఉన్నప్పటికీ, మరోవైపు భారతదేశంలో పప్పుల ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారే ప్రమాదమూ

కెనడాతో దౌత్య యుద్ధం ప్రభావం
ఆ దేశం నుంచి తగ్గిన దిగుమతులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం నేపథ్యంలో గతవారం నుంచి భారత్కు కెనడా నుంచి పప్పుల దిగుమతులు మందగించాయి. దీని వల్ల కెనడాలోని రైతులకు పప్పుల ధరల్లో కోతపడే ప్రమాదం ఉన్నప్పటికీ, మరోవైపు భారతదేశంలో పప్పుల ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారే ప్రమాదమూ ఉందన్న ఆందోళన నెలకొంది. వచ్చే ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది రాజకీయంగా ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఎర్రపప్పు కెనడా నుంచి అత్యధికంగా భారత్కు సరఫరా అవుతుంది. ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎగుమతి, దిగుమతులపై పరిమితులు విధించే ముప్పు ఉందని కెనడా నుంచి ప్రధాన దిగుమతిదారు అయిన ఓలం అగ్రి ఇండియా సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు నితిన్ గుప్తా చెప్పారు. అయితే, ప్రభుత్వం వద్ద అలాంటి ఆలోచనలేమీ లేవని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, భారత్తో వ్యాపార సంబంధాలపై నేరుగా ప్రభావం పడే చర్యలేమీ ప్రస్తుతం కెనడా తీసుకోలేదని కెనడా అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అధికారి ఒకరు చెప్పారు. ఈ ఏడాది మొదట్లో పంట దిగుబడులు రాగానే భారతీయ వ్యాపారులు కెనడా నుంచి భారీస్థాయిలో ఎర్రపప్పును కొనుగోలు చేశారు. అయితే, అప్పటితో పోలిస్తే.. నిజ్జర్ హత్యపై ట్రూడో వ్యాఖ్యల అనంతరం కెనడాలో ఎర్రపప్పు ధర 6ు పడిపోయిందని ఆ దేశానికి చెందిన ప్రధాన ఎగుమతిదారు ఒకరు చెప్పారు. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కెనడా నుంచి 4,85,495 టన్నుల(రూ.3,079 కోట్ల విలువ) ఎర్రపప్పు భారత్కు సరఫరా అయ్యింది. ఇది భారతదేశ ఎర్రపప్పు మొత్తం దిగుమతుల్లో సగం కంటే ఎక్కువే. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 1,90,784 టన్నుల ఎర్రపప్పు కెనడా నుంచి భారత్కు దిగుమతి కాగా, ఈ ఏడాది అదే కాలానికి కెనడా నుంచి ఎర్రపప్పు దిగుమతి 420ు పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. భారత్లో ఏటా సుమారు 24 లక్షల టన్నుల ఎర్రపప్పును వినియోగిస్తుండగా, స్థానికంగా ఉత్పత్తి అయ్యేది 16 లక్షల టన్నులు మాత్రమేనని భారత పప్పుదినుసులు, ధాన్యం వ్యాపారుల అసోసియేషన్ చైర్మన్ బిమల్ కొతారీ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గతేడాదిగా భారత్లో ఎర్రపప్పు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతోపాటు కెనడాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇతరదేశాల నుంచి కూడా ఎర్రపప్పు దిగుమతులు చేస్తోంది. ఈ ఏడాది భారత్కు ఎర్రపప్పు ఎగుమతుల్లో కెనడాను ఆస్ర్టేలియా అధిగమించేసిందని వ్యవసాయ వస్తువుల పరిశోధన సంస్థ ఐగ్రెయిన్ ఇండియాకు చెందిన రాహుల్ చౌహాన్ చెప్పారు. భారత్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కెనడా నుంచి 95 వేల టన్నుల ఎర్రపప్పును దిగుమతి చేసుకోగా, అదే సమయంలో ఆస్ర్టేలియా నుంచి 1.99 లక్షల టన్నులు దిగుమతి చేసుకొందన్నారు. మరోవైపు ప్రభుత్వం ఎర్రపప్పుపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆస్ర్టేలియా, రష్యా దృష్టి సారించాయి.