Lokesh: పోలీసులను అలా మార్చింది జగన్ మోసపు పాలనే..
ABN, Publish Date - Feb 02 , 2024 | 01:41 PM
Andhrapradesh: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు చిక్కిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులను గంజాయి స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా జగన్ మోసపు వైసీపీ పాలన మార్చిందని వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 2: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు చిక్కిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై (AP Government) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులను గంజాయి స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా జగన్ మోసపు వైసీపీ పాలన మార్చిందని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక ఉగ్రవాది జగన్ (CM Jagan) పాలకుడు కావడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. క్రిమినల్ - ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గజదొంగ జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొంతమంది పోలీసులు దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఖాకీలను జగన్ ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యాలుగా వాడటంతో వారికీ నేరాలు అలవాటైపోయాయన్నారు. సీఐడీని కిడ్నాప్లు, బెదిరింపుల కోసం పాలకులే వినియోగిస్తుండడంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని పోలీసులు ముఠాలుగా ఏర్పడి స్మగ్లింగ్, కిడ్నాపులకు పాల్పడుతున్నారని యువనేత ఆరోపించారు.
పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మంటగలిపిందని మండిపడ్డారు. కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పని చేస్తున్న సుజన్ ఓ ముఠాని ఏర్పాటు చేసి ఏపీ సీఐడీ బృందం పేరుతో ఐటీ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. గంజాయి మాఫియాకి ఏపీ సర్కారు పెద్దల అండదండలున్నాయని తెలిసిన పోలీసులు గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారన్నారు. 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కడం ఏపీలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారిన దుస్థితిని వెల్లడిస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 02 , 2024 | 01:41 PM