Share News

ప్రాణాలు తోడేస్తున్న వాయుకాలుష్యం

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:17 AM

వాయుకాలుష్యం పలు రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చి పెట్టటమే కాదు..

ప్రాణాలు తోడేస్తున్న వాయుకాలుష్యం

హైదరాబాద్‌తోపాటు దేశంలోని పది నగరాల్లో అంతర్జాతీయస్థాయి అధ్యయనం

రోజువారీ మరణాల్లో 7.2 శాతానికి వాయుకాలుష్యమే కారణం

వాహన, పారిశ్రామిక ఉద్గారాలతోనే ముప్పు: లాన్సెట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 4: వాయుకాలుష్యం పలు రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చి పెట్టటమే కాదు.. ఏకంగా ప్రాణాలనే హరిస్తోంది. మన దేశంలో ప్రధాన నగరాల్లో రోజువారీ సంభవించే మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలు వాయుకాలుష్యం వల్లనే సంభవిస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ నగరాల్లో హైదరాబాద్‌ కూడా విశేషం. ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజెస్‌ కంట్రోల్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన పరిశోధన సంస్థలతో కూడిన ఒక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణె, షిమ్లా, వారణాసిల్లో పరిశోధకులు.. పీఎం 2.5 వాయుకాలుష్యానికి ఆయా నగరాల్లో మరణాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. 2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం ఉన్న కాలుష్య కణాలను పీఎం 2.5 కాలుష్యంగా పేర్కొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో ఒక ఘనపు మీటరుకు 15 మైక్రోగ్రాముల పీఎం 2.5లోపు ఉంటే అక్కడి గాలి సురక్షితంగా ఉన్నట్లు. అయితే, భారత్‌లో వాయు ప్రమాణాలు వేరుగా ఉన్నాయి.


60 మైక్రోగ్రాములలోపు పీఎం 2.5 ఉంటే నాణ్యమైన గాలిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మన దేశంలోని ప్రమాణాల ప్రకారమే శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. 2008-2019 మధ్య కాలంలో పది నగరాల్లో సంభవించిన 36 లక్షల మరణాలు, వాటికి కారణాలను విశ్లేషించారు. దీని ప్రకారం.. నగరాల్లో పీఎం 2.5 కాలుష్యానికి ప్రధాన కారణం వాహన, పారిశ్రామిక ఉద్గారాలే. రోజువారీ మరణాల్లో వీటి వల్ల సంభవిస్తున్నవి 7.2 శాతం ఉన్నాయి. పీఎం 2.5 కాలుష్య కారకాలు సగటున 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీగా 2.7 శాతం మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఢిల్లీలో పీఎం 2.5 కాలుష్యం అత్యధికంగా 113 స్థాయిలో ఉండగా, అక్కడి రోజువారీ మరణాల్లో 11.5 శాతం మరణాలకు వాయుకాలుష్యం కారణమవుతోంది. హైదరాబాద్‌లో పీఎం 2.5 38.9 ఉండగా, రోజువారీ మరణాల్లో 5.6 శాతం వాయుకాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి. మొత్తం 10 నగరాల్లో షిమ్లాలో పీఎం 2 కాలుష్యం అత్యల్పగా 28.4 స్థాయిలో ఉంది. అక్కడి రోజువారీ మరణాల్లో వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నవి 3.7 శాతమే. ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ముఖ్య శాస్త్రవేత్తల్లో ఒకరైన భార్గవ్‌ కృష్ణ మాట్లాడుతూ, దేశంలో వాయుకాలుష్యం ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయిందన్నారు. వాయునాణ్యతకు సంబంధించి భారత్‌లో నిర్ణయించుకున్న ప్రమాణాలు ఉండాల్సిన పరిమితి కన్నా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

Updated Date - Jul 05 , 2024 | 01:20 AM