Share News

బెంగాల్‌ డీజీపీపై వేటు

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:01 AM

లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) పలువురు బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు వేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అవకాశాలున్న బ్యూరోక్రాట్లపై ఈ చర్యలు తీసుకుంది. అధికార పార్టీలకు విధేయులుగా ఉండేవారు..

బెంగాల్‌ డీజీపీపై వేటు

పోలీస్‌ బాస్‌ను తప్పించిన ఈసీ.. వెనువెంటనే కొత్త డీజీపీ నియామకం

6 రాష్ట్రాల హోం సెక్రటరీల మార్పు.. వీటిల్లో 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు

వారెవరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దు.. సీఎస్‌లకు ఈసీ ఆదేశాలు

బృహన్‌ముంబై కార్పొరేషన్‌ బదిలీలపై సీరియస్‌ హెచ్చరికలు

న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) పలువురు బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు వేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అవకాశాలున్న బ్యూరోక్రాట్లపై ఈ చర్యలు తీసుకుంది. అధికార పార్టీలకు విధేయులుగా ఉండేవారు.. ఒకటి కంటే ఎక్కువ శాఖలకు బాధ్యత వహిస్తున్న వారిని గుర్తించి, వారి జాబితాను పంపుతూ.. వెంటనే బదిలీ చేయాలంటూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇలా బదిలీ అయిన అధికారులకు ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టింగ్‌లు ఇవ్వాలని సూచించింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ డీజీపీ రాజీవ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఆయన పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీకి కుడిభుజంగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్‌ డీజీపీని బదిలీ చేయడం గమనార్హం..! రాజీవ్‌కుమార్‌పై ఈసీ బదిలీ వేటు వేయడంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగ్గురు సీనియర్‌ ఐపీఎ్‌సల పేర్లను ఈసీకి పంపారు. వారిలోంచి వివేక్‌ సాహాను ఈసీ ఎంపిక చేయగా.. వెనువెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. 2021లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివేక్‌ సాహాపైనా ఈసీ వేటు వేయడం గమనార్హం..! ఆరు రాష్ట్రాల-- గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను కూడా బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల సీఎ్‌సలను ఆదేశించింది. వీటిల్లో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ బీజేపీ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం..! వీరంతా హోంశాఖ కార్యదర్శులుగా ఉంటూనే.. ఇతర విభాగాల బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నట్లు గుర్తించినట్లు ఈసీఐ పేర్కొంది. ఇలాంటి కారణాలతోనే మిజోరం, హిమాచల్‌ప్రదేశ్‌ జీఏడీ కార్యదర్శులను కూడా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా స్థానాల్లో కొత్తగా నియమించాలనుకుంటున్న అధికారుల జాబితా(మూడేసి మంది పేర్లు) తమకు పంపాలని, తాము నియామకానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు సోమవారం రాత్రికల్లా నియామకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా.. పశ్చిమబెంగాల్‌ డీజీపీని ఈసీ బదిలీ చేయడంపై తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) సీరియ్‌సగా స్పందించింది. ఈసీని అడ్డుపెట్టుకుని, రాజకీయాలు చేయడం బీజేపీ నైజమని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ ఆరోపించారు.

మహారాష్ట్ర సీఎ్‌సపై సీరియస్‌!

బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లో కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ సహా.. ఓ అదనపు కమిషనర్లు, ఇంకో డిప్యూటీ కమిషనర్‌ను తొలగించాలని ఈసీఐ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే.. బీఎంసీ విషయంలో మూడేళ్ల నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని, కొవిడ్‌ సమయంలో ఇక్బాల్‌సింగ్‌ విశేష సేవలందించారని పేర్కొంటూ ఈసీఐకి సీఎస్‌ లేఖ రాశారు. దీనిపై ఈసీఐ సీరియస్‌ అయినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం 6 గంటల్లోగా బదిలీలు జరపాలంటూ మరోమారు ఆదేశించింది. అంతేకాదు.. ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న అధికారులను కూడా బదిలీ చేయాలని సూచించింది. కాగా.. మహారాష్ట్రలో బీజేపీ మద్దతున్న శివసేన(శిందే వర్గం) అధికారంలో ఉండడం గమనార్హం..! ఈసీ ఆదేశాలు వెలువడిన వెంటనే ఇక్బాల్‌సింగ్‌ను తొలగించిన మహారాష్ట్ర సర్కారు.. ముగ్గురు సీనియర్ల పేర్లను ఎన్నికల కమిషన్‌కు పంపింది.

ఏపీపైనా ఫోకస్‌..!

సొంత జిల్లాల్లో.. ఒకే స్థానంలో మూడేళ్లకుపైగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఇప్పటికే ఈసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..! ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు ఉన్నతాధికారులపై కొరడా ఝలిపించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇంతకు ముందే.. ప్రతిపక్షాలు జగన్‌ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న పలువురు ఉన్నతాధికారుల జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన విషయం తెలిసిందే.

Updated Date - Mar 19 , 2024 | 03:01 AM