జోరుగా అసాంఘిక కార్యక్రమాలు
ABN, Publish Date - Sep 09 , 2024 | 10:40 PM
అసాంఘిక కార్యక్రమాలకు జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. జూదం, వ్యభిచారం, సెటిల్మెంట్లు, గంజాయి వినియోగం, మారణాయుధాల రవాణా నిత్యకృత్యమైంది. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కులు వచ్చి ఇక్కడ దందాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు పోలీసు దాడులు జరుగుతున్నా.... మరో వైపు యథేచ్ఛగా అక్రమ దందాలు కొనసాగుతున్నాయి.
మంచిర్యాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచి మంచిర్యాల వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, వ్యాపారస్తు లు జిల్లా కేంద్రంలో స్థలాలు కొనుగోలు చేస్తూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ నగరం వేగంగా విస్తరి స్తోంది. జన సంచారం పెరుగుతుండటంతో అక్రమ దందా, అసాంఘిక కార్యక్రమాలు కూడా అడ్డగోలుగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, పట్టా భూములు కబ్జా చేయడం, నిర్మాణాలు చేపట్టడం, ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేయడం పెరిగిపోతున్నాయి. భూ దందాలో నెలకొంటున్న వివాదాలను సెటిల్ చేయడానికి గ్యాంగ్స్టర్లు అవతరించా రంటే అతిశయోక్తికాదు. సెటిల్మెంట్లతో స్థానికంగా భయానక వాతావర ణం నెలకొంది. యువకులను చేరదీసి, వారిని మద్యం, గంజాయి సేవ నంతో పెంచి పోషిస్తూ విచ్చలవిడిగా సెటిల్మెంట్లు చేస్తున్నా అడిగేవారు కరువయ్యారు. వివిధ రకాల వివాదాల్లో తలదూరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
జూదంలోనూ టాప్....
జిల్లాలో జూదం జోరుగా సాగుతోంది. పోలీసుల తనిఖీల్లో పలువురు పట్టుబడుతున్నారు. ఈ నెల 8న రాత్రి మార్కెట్ ఏరియాలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దాడుల సందర్భంగా రూ. 52,320 నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పట్టుబడ్డ వారిలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యక్తులు ఉండటం గమనార్హం. గత నెల 9న అశోక్ రోడ్డులోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఏడుగురు పట్టుబడ్డారు. బెల్లంపల్లి, జైపూర్ పోలీస్ సబ్డివిజన్ పరిధిలోనూ పేకాట దందా కొనసాగుతోంది. గత నెల 10న బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు, తాళ్లగురిజాల పోలీస్స్టేషన్ పరిఽధిలో ఎనిమిది మంది, కోటపల్లి పోలీస్ పరిధిలోని రాపన్పల్లి అటవీ ప్రాంతంలో ఏడుగురు, పారుపెల్లి శివారులో పేకాడుతున్న నలుగురు, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్లపొదల్లో పేకాట ఆడుతుండగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
పెరుగుతున్న గన్ కల్చర్.....
జిల్లాలో తుపాకుల వినియోగం పెరుగుతోంది. ఈ నెల 5న జిల్లా కేంద్రంలోని ఏసీసీలో తుపాకీతో బెదిరించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నెన్నెల మండలానికి చెందిన జితేందర్ భార్యను కలవడానికి ఏసీసీకి రాగా అక్కడే ఉన్న అన్వేష్ అనే వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు. జితేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితునితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద తుపాకీతోపాటు ఓ ఎయిర్ పిస్టల్, రెండు కత్తులు లభ్యమయ్యాయి.
గతంలో ఓ స్థలం వివాదంలో గోదావరి సమీపంలో శంకర్గౌడ్ అనే వ్యక్తిపై మరో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చాడు. జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌజ్ వద్ద సెటిల్మెంట్లు చేస్తూ గన్తో బెదిరించిన కేసులో మల్లారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నస్పూర్లో ఓ ఇంట్లో డమ్మీ తుపాకులతో బెదిరింపులకు గురి చేసిన సంఘటన వెలుగు చూసింది. పలువురు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్యాంగ్స్టర్లు, రాజకీయ నాయకుల వద్ద లైసెన్సులు లేని తుపాకులు జిల్లా కేంద్రంలోనే పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న అసాం ఘిక కార్యకలాపాలను పోలీసుశాఖ కూకటి వేళ్లతోసహా పెకిలించడం ద్వారా ప్రజల భయాందోళనలను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిత్యకృత్యమైన వ్యభిచారం....
జిల్లా కేంద్రంలో వ్యభిచారం ఈ మధ్యకాలంలో నిత్యకృత్యమైంది. బెల్లంపల్లి చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి చెందిన సాయి రెసిడెన్సీ లాడ్జీలో ఇటీవల వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. 20 రోజుల వ్యవధిలో అదే లాడ్జిలో పలు వురు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సంచలనం సృష్టించింది. మొదటి సారి లాడ్జి ఓనరే ఇద్దరు మహిళతో వ్యభిచారం చేస్తూ పట్టుబడగా, ఈ నెల 7న వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు మహిళలతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. సదరు లాడ్జిలో రెండు గంటలు రూం బుక్ చేస్తే రూ.1100 చార్జీ వసూలు చేస్తున్నారు. జన్మభూమి నగర్లోని ఓ గెస్ట్హౌజ్లో స్థానికులు కొందరు వ్యభిచారం చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపి అదుపులోకి తీసు కున్నారు. అయితే పోలీసుల దృష్టికి వచ్చింది కొన్ని సంఘటనలే అయినా గుట్టుచప్పుడు కాకుండా లాడ్జీలు, ప్రైవేటు బిల్డింగుల్లో వ్యభిచారం జోరుగా సాగుతోంది.
Updated Date - Sep 09 , 2024 | 10:40 PM