మోడల్ స్కూళ్లలో బదిలీలు
ABN, Publish Date - Sep 14 , 2024 | 11:06 PM
ఆదర్శ పాఠశా లల్లో ఉపాధ్యాయుల బదిలీల కల ఎట్టకేలకు సాకారమైంది. బదిలీల కోసం పుష్కర కాలంగా ఎదురు చూస్తుండగా కోర్టు, ప్రభుత్వం చొరవతో మోక్షం లభించినట్లయింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను ఆంగ్ల మాద్య మంలో అందించే లక్ష్యంతో 2012లో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది.
మంచిర్యాల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాఠశా లల్లో ఉపాధ్యాయుల బదిలీల కల ఎట్టకేలకు సాకారమైంది. బదిలీల కోసం పుష్కర కాలంగా ఎదురు చూస్తుండగా కోర్టు, ప్రభుత్వం చొరవతో మోక్షం లభించినట్లయింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను ఆంగ్ల మాద్య మంలో అందించే లక్ష్యంతో 2012లో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పాఠశాలల పర్యవేక్షణ కొంతకాలం తన పరిధిలోనే ఉంచుకున్న కేంద్రం అనంతరం రాష్ట్రాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఆయితే మోడ ల్ స్కూళ్లు ప్రారంభమై 12 సంవత్సరాలు కావస్తున్నా వాటిలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ఇంతకాలం బదిలీలకు నోచుకోలేదు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఒకే చోట విధులు నిర్వహించాల్సి రావడం, పూర్తిస్థాయిలో మార్గదర్శ కాలు అమలు కాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వచ్చింది.
తెల్లవారేసరికి వెలువడిన బదిలీ ఉత్తర్వులు
మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ప్రిన్సిపాల్, ఇతర ఉపా ధ్యాయుల బదిలీలకు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యు కేషన్, ఎక్స్ఆఫీషియో ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 13న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో ఇంతకాలం కోర్టు కేసుల కారణంగా జాప్యం జరుగగా, ఈ సారి ఆ అవకాశం లేకుండా రాత్రికి రాత్రే జీవో విడుదల చేస్తూ వెంటనే అమలుచేశారు. దీంతో శనివారం ఉదయం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. పని చేస్తున్న స్థలంలో రిలీవై తక్షణమే కొత్త ప్లేస్లో విధుల్లో చేరాల్సి వచ్చింది. జిల్లాలో దండేపల్లి, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, కోటపల్లి మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉన్నాయి. దండేపల్లి మండలంలోని లింగాపూర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండగా, మిగతా మూడు చోట్ల ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు, అవర్లీ బేస్డ్ టీచర్లు విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం బదిలీలు చేపట్టడంతో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు చేరే అవకాశం ఉంది.
ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ఇబ్బందులు....
ఆగమేఘాల మీద ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్, స్పౌజ్ పాయిం ట్లను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఎడిట్ ఆప్షన్ విషయంలో 13 నెలల క్రితం తీసుకున్న వాటినే ప్రస్తుత బదిలీల్లో అమలు చేశారు. దాదాపు సంవత్స రం గడవడంతో ఈ లోగా ఇతర డిపార్ట్మెంట్లలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అనేక చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఇచ్చి ఉంటే ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచు కొని ఉండేవారు. హడావుడిగా బదిలీలు చేపట్టడంతో ఆ అవ కాశం దక్కకుండా పోయింది. తద్వారా స్పౌజ్ పాయింట్లను ప్రభుత్వం పరిగణనకు తీసుకోలేదు. స్పౌజ్ పాయింట్లను పరిగణలోకి తీసుకుంటే బదిలీల్లో అదనపు మార్కులు కలిసి ఒక చోటీకి బదిలీపై వెళ్లేవారు. ప్రభుత్వం పై రెండు అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా జిల్లాలో పది మందికి కోరుకొనే చోటుకు బదిలీపై వెళ్లలేకపోయారు.
అయోమయంలో హెచ్బీటీలు...
ప్రభుత్వం బదిలీలు చేపట్టడంతో ఇంతకాలం మోడల్ స్కూళ్లలో పని చేసిన హెచ్బీటీల పరిస్థితి అయోమయంలో పడింది. బదిలీల్లో భాగంగా అన్ని మోడల్ స్కూళ్లకు రెగ్యులర్ ఉపాధ్యాయులు రానున్నారు. దీంతో హెచ్బీటీలు ఉన్నఫలంగా విధుల నుంచి తప్పుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016 నుంచి జిల్లా వ్యాప్తంగా 70 మంది వరకు అవర్లీ బేస్డ్ టీచర్స్ పని చేస్తున్నారు. రోజుకు ఇన్ని గంటలంటూ విధులు నిర్వహించే వారికి రెగ్యులర్ టీచర్ల రాకతో ఉపాధి కోల్పోవలసి వచ్చింది. దీంతో వారంతా తీవ్ర మనస్తాపానికి గురవుతు న్నారు. తమను కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించా లని సంవత్సరాల తరబడి హెచ్బీటీలు పలు రకాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాలు పట్టిం చుకోకపోవడంతో రోడ్డున పడాల్సి వచ్చింది. ఆదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల క్రితం అక్కడి ప్రభుత్వం హెచ్బీటీలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించి మినిమం టైమ్ స్కేల్ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో హెచ్బీటీ లకు ఉద్యోగ భద్రత కల్పించినట్లయింది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో హెచ్బీటీలంతా అయోమయంలో పడ్డారు.
Updated Date - Sep 14 , 2024 | 11:06 PM