Share News

Bandi Sanjay: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం భూదందా.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:42 PM

హైదరాబాద్‌లో నాలుగో నగరాన్ని నిర్మించబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.

Bandi Sanjay: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం భూదందా.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Bandi Sanjay Kumar

హైదరాబాద్: హైదరాబాద్‌లో నాలుగో నగరాన్ని నిర్మించబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఈ నాలుగో నగరాన్ని రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. ఈ నగరంలో ఆరోగ్య, క్రీడా హబ్‌లు ఏర్పాటు చేస్తామని, మెట్రోతో అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

‘ఫోర్త్ సిటీ’ పేరుతో భూ దందా

అయితే, ఈ విషయంపై ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ ప్రకటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూ దందా కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి... రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ విమర్శించారు.

‘ధరణి’.. రూ.2 లక్షల కోట్ల స్కాం..?

మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో ఆదివారం నాడు బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ కుమార్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ... ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు.


హిందువుల పండుగలకు పైసలివ్వరు..?

‘‘తెలంగాణ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు... తమ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులివ్వదు. హిందువుల పండుగలకు పైసలివ్వరు.సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. రంజాన్‌కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు రూ.2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటు. హిందువుల పండుగలంటే అంత చులకనా? బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోంది’’ అని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


నాపై మతతత్వ ముద్ర..?

‘‘ఎంఐఎం విషయాన్ని ఎత్తిచూపితే నాపై మతతత్వ ముద్ర వేయాలని చూస్తున్నారు. ఇలానే వ్యవహరిస్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టడం ఖాయం. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేటా మునగడం ఖాయం. 15 నిమిషాలపాటు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని తీసుకెళ్లి కొడంగల్‌లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గు చేటు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు ఆలోచించాలి. నిరంతరం బీజేపీని విమర్శించడం మానుకోవాలి. కేంద్రంతో సమన్వయంతో వ్యవహరించాలి. తెలంగాణ అభివృద్ధికి మేం పూర్తిగా సహకరిస్తాం. కలిసికట్టుగా పనిచేసి నిధులు తీసుకువద్దాం. అంతే తప్ప ప్రధానమంత్రి నరేంద్రమోదీని అదేపనిగా విమర్శించడం నష్టమే తప్ప లాభం లేదనే అంశాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలి’’ అని బండి సంజయ్ కుమార్ హితవు పలికారు.


తెరపైకి భూ దందా..?

‘‘మహేశ్వరాన్ని ఫోర్త్ సిటీగా మారుస్తామనే సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు... పెద్దఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారు. రుణమాఫీ... ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.


రైతులు అల్లాడుతున్నారు..

‘‘లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే... లక్షన్నర లోపు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరం. అంటే నూటికి 70 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. ఒకవైపు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి, బయట చేసిన అప్పులు తీరక, పెట్టుబడికి పైసల్లేక రైతులు అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతోంది. రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేసేందుకు కాంగ్రెస్ నేతలకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రజల దృష్టిని మళ్లించడం అలవాటు అయిపోయింది. రాబోయే స్థానిక సంస్థల్లో గెలిచేందుకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. రుణమాఫీతో సహా 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కార్యచరణ సిద్ధం అవుతోంది’’ అని బండి సంజయ్ తెలిపారు.


అసైన్డ్ భూములు ఎలా తగ్గాయి...?

‘‘ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. భూమాతను భూ మేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్ప‌డిన 2014 నాటికి రాష్ట్రంలో 24 ల‌క్ష‌ల అసైన్డ్ భూములుంటే నేడు ఆ భూములు ఐదు ల‌క్ష‌ల‌కు ఎలా త‌గ్గాయి...? అసైన్డ్ భూములు, శిఖం భూములు, దేవాదయ, అటవీ, భూదాన భూములతోపాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు దండుకున్నారు. రిజిస్ట్రేష‌న్లు చేయించుకున్న వివ‌రాలేవీ..? వాటిని ఎందుక‌ని రేవంత్ స‌ర్కారు బ‌య‌ట పెట్ట‌డం లేదు...? ఆ భూముల విలువ రూ. 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయల వ‌ర‌కు ఉంటుందా..? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.


ధరణి క‌మిటీ నివేదిక ఏది..?

‘‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ధ ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదు..? అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు స‌భ్యుల‌తో వేసిన క‌మిటీ నివేదిక ఏది..? ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులెవ‌రో ఎందుకు తేల్చడం లేదు..? ధరణిపై వేసిన కమిటీ బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా దోచుకోవాలా..? అనే అంశంపై రహస్య నివేదిక ఇచ్చినట్లుంది. అందుకే ఫోర్త్ సిటీ, భూమాత పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్తులో గజం భూమి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


విలీన కుట్ర చేస్తున్నారు..

‘‘గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డు.. వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్ధం లేనిది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకే విలీన కుట్ర చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారులోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని అభివృద్ధి చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలను విలీనం చేస్తామనడం అర్ధం లేనిది. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణను ప్రకటిస్తుంది’’ అని బండి సంజయ్ వెల్లడించారు.

Updated Date - Aug 04 , 2024 | 06:38 PM