Share News

Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

ABN , Publish Date - Sep 17 , 2024 | 02:57 AM

‘పొద్దుగాల తాగుడు షురూ చేస్తే ఎలా? పూట గడవటం ఎలా... కుటుంబం ఏం కావాలి?’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలువురు మద్యం ప్రియులను మందలించారు.

Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

  • పూట గడిచేదెలా? కుటుంబం ఏంకావాలి?

  • మందుబాబులకు రాజగోపాల్‌రెడ్డి క్లాస్‌

మునుగోడు, సెప్టెంబరు 16: ‘పొద్దుగాల తాగుడు షురూ చేస్తే ఎలా? పూట గడవటం ఎలా... కుటుంబం ఏం కావాలి?’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలువురు మద్యం ప్రియులను మందలించారు. ‘‘గ్రామాల్లో అసలే పేద కుటుంబాలు.. రోజంతా పనిచేస్తేనే కుటుంబం గడిచేది కష్టం... కనీసం మధ్యాహ్నం కాకముందే మద్యం తాగుతున్న మీకు పూట గడవటం ఎట్లా.. కుటుంబ సభ్యులు ఏం కావాలి’ అని ప్రశ్నించారు. మద్యం దుకాణాల పర్మిట్‌ రూముల్లో ఉదయం 11 గంటలకే మద్యం తాగుతున్న వారికి ఎమ్మెల్యే ఇలా క్లాస్‌ తీసుకున్నారు.


సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వివిధ దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన మద్యం సీసాలను పరిశీలించారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులకు మద్యం విక్రయిస్తున్నారా? షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నారా? అని నిర్వాహకులను అడిగి తెలుసున్నారు. పర్మిట్‌ రూములను తనిఖీ చేస్తున్న క్రమంలో ఉదయం 11గంటలకే పలువురు మద్యం తాగుతూ కనిపించారు. దీంతో వారిని తీవ్రంగా మందలించి అక్కడి నుంచి పంపించివేశారు.


పర్మిట్‌ రూంలను ఉదయం తెరవడం పట్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సాయంత్రం మాత్రమే తెరవాలని సూచించారు. అనంతరం ఎక్సైజ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, ఇందుకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. బెల్టు షాపులను పూర్తిగా ఎత్తివేసిన మండల పరిధిలోని గుండ్లోరిగూడెం గ్రామ కమిటీ సభ్యులను సన్మానించారు.

Updated Date - Sep 17 , 2024 | 02:57 AM