వైభవంగా మాఘమాస తిరునాళ్లు
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:26 PM
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): మాఘమాస మహోత్సవాల్లో భాగంగా గత రెండు ఆదివారాలుగా నిర్వహిస్తోన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి తిరునాళ్లు అశేష భక్తుల నడుమ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్ సర్పవరంలో వేంచేసిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామిని దర్శించుకునేందుకు రెండో ఆది వారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

సర్పవరంలో భావనారాయణస్వామి ఆలయానికి
పోటెత్తిన వేలాది మంది భక్తులు
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): మాఘమాస మహోత్సవాల్లో భాగంగా గత రెండు ఆదివారాలుగా నిర్వహిస్తోన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి తిరునాళ్లు అశేష భక్తుల నడుమ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్ సర్పవరంలో వేంచేసిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామిని దర్శించుకునేందుకు రెండో ఆది వారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలాచరించి భక్తిశ్రద్ధలతో ఆలయ ఈశాన్య దిక్కులో ఉన్న లక్ష్మీదేవి, ఆగ్నే యంలో ఉన్న ఆదిశేషు శ్రీభావనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆవుపిడకలతో ఏర్పాటుచేసిన పొయ్యిలపై పాలపొంగులు తయారు చేసి, మొలకెత్తిన పెసలు, రేగుపండ్లు, చెరకు ముక్కలు, అరటి పండ్లను స్వామివారికి నైవేథ్యంగా నివేదించారు. అనం తరం ఈ ప్రసాదాన్ని మహిళా భక్తులు చీరకొంగుల్లో ఒడిసి పట్టుకుని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్ల శ్రీరాములు, దేవదాయ, ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో దాతల వితరణలో భారీ అన్నదానం చేశారు. రెండో ఆది వారం స్వామివారిని సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సర్పవరం ఎస్హెచ్వో బి.పెద్దిరాజు ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. స్థానిక హైస్కూల్కి చెందిన విద్యార్థులు సేవలు అందించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 11:26 PM