రోగులకు సకాలంలో వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:52 AM
రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ మంగళవారం ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో వైద్యులు, నర్సులు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.

ప్రభుత్వ బోధనాసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ తనిఖీలు
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ మంగళవారం ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో వైద్యులు, నర్సులు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందేలా వైద్యసిబ్బంది ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమయానికి వైద్యసేవలు అందించడంతోపాటు రోగుల పట్ల దయాగుణం కలిగి ఉండాలని సూచించారు. వైద్యసేవల విషయంలో రోగులు సంతృప్తి చెందేలా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. జీటీజీహెచ్లో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడంలో భాగంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ వెల్లడించారు.
ఉద్యోగాల పేరుతో మోసంపై విచారణ
కాగా, ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన యువతికి సంబంధించిన విషయంపై ప్రభుత్వ బోధనాసుపత్రి అధికారులు మంగళవారం అంతర్గత విచారణ జరిపారు. కొందరు ఉద్యోగులను పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోసానికి పాల్పడిన యువతితో తమకు ఎలాంటి సంబంధంలేదని, ట్రైనింగ్ కోసం వచ్చిన స్టూడెంట్ను అని చెప్పి కొద్దిరోజులు తమ విభాగంలో పనిచేసిందని, ఆమె గురించి తమకు ఏమీ తెలియదని ఈ సందర్భంగా విచారణాధికారుల ఎదుట ఉద్యోగులు చెప్పినట్టు తెలిసింది. కాగా, ఈ విషయంపై ఆసుపత్రి అధికారులు కొన్నాళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.