ప్రతి హామీ నెరవేరుస్తా : మంత్రి బీసీ
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:06 AM
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.

సంజామల, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి) : ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ముదిగేడు సంజామల డబుల్ రోడ్డు నిర్మాణానికి సంజామల వేరుహౌస్ వద్ద ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వ రరెడ్డి, ఈఈ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ మాట్లాడుతూ గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. న్యూడెవలప్మెంట్ బ్యాంకు ద్వారా రూ.1080 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. ఒక్క బనగానపల్లె నియోజకవర్గంలోనే గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు కావడం హర్షించదగ్గ విషయమన్నారు. త్వరలో పేదల కు ఇళ్ల పట్టాలు, జలజీవన మిషన ద్వారా రక్షిత మంచినీరు తదితర పథకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముదిగేడు నుంచి సంజా మల వరకు అధ్వానంగా ఉన్న ఆరు కిలోమీటర్ల రహదారికి నాడు నేడు నిధులు తెచ్చింది నేనే అని బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇనచార్జి బత్తుల వెంకట ప్రతాప్ రెడ్డి, ఎంపీడీవో సాల్మన, తహసీల్దారు అనిల్ కుమార్, సునీల్ రెడ్డి, రెడ్డి గోవిందు, ఏవో సుధాకర్ రెడ్డి, ఏపీవో ప్రకాష్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు అదనపు వేతనం పంపిణీ
బనగానపలె: పట్టణంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు అదనపు వేతనం శుక్రవారం రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి పంపి ణీ చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సాహంగా కార్మికులు పని చేయాలని కోరారు. తమకు అదనంగా వెయ్యి వేతనం పెంచిన మంత్రి బీసీకి పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.