అమరావతి 2.0కు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:37 AM
మరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశాలు ఉండటంతో లక్ష నుంచి నాలుగు లక్షల మంది వరకు జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా టెంట్లు, గ్యాలరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ప్రణాళిక
నాలుగు లక్షల మంది జన సమీకరణ
మూడు భారీ టెంట్లు ఏర్పాటు చేసే యోచన
అమరావతి రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ
ప్రధాన వేదికతో పాటు సాంస్కృతిక వేదిక
తెలుగు సంప్రదాయాలు తెలిసేలా ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశాలు ఉండటంతో లక్ష నుంచి నాలుగు లక్షల మంది వరకు జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా టెంట్లు, గ్యాలరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నాలుగు లక్షల మందికి కూర్చోవటానికి వీలుగా మూడు భారీ వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఒకవేళ సభ సాయంత్రం పూట జరిగితే ఓపెన్గా గ్యాలరీలు మాత్రమే ఉంచాలని చూస్తున్నారు. ముందు వరుసలో రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తారు. అధికారులు, ఎంవీఐపీలు, వీవీఐపీలు, ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులకు వేర్వేరుగా గ్యాలరీలు ఉంటాయి. వీరందరితో పాటు వీఐపీలకు కూడా ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. ప్రధాన వేదికను భారీ ఎల్ఈడీలతో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. సాంస్కృతిక వేదికను కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కూచిపూడి, ఇతర సంప్రదాయ నృత్యాలను ఈ వేదికపై ప్రదర్శించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
అమరావతి చరిత్ర గురించి ప్రధాని నరేంద్రమోదీకి చాటిచెప్పేలా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్లో అమరావతి బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, ఇతర శిల్పాలు వంటివి ప్రదర్శించనున్నారు.
రాజధానిలో నిర్మించే ఐకానిక్ భవనాలకు సంబంధించిన త్రీడీ ప్రింట్స్ను ప్రదర్శించాలని నిర్ణయించారు. 40 అంతస్థులతో కూడుకున్న సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్జీవో, గవర్నమెంట్ టైప్-1, 2 - ఆహుతులకు రుచికరమైన తెలుగు వంటకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల్లో కూర్చున్న చోటకే ప్యాకింగ్ల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సంప్రదాయ శాకాహార వంటలు, పిండివంటలకే పెద్దపీట వేస్తారు.
అతిథుల కోసం నాలుగు హెలీప్యాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో రెండు మాత్రం మోదీ, భద్రతా సిబ్బందికి కేటాయించనున్నారు. మిగిలిన రెండింటినీ కేంద్ర మంత్రుల కోసం వినియోగించనున్నారు.
శంకుస్థాపన ప్రాంతానికి కళ తీసుకొచ్చేందుకు వీలుగా సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎయిర్ బెలూన్స్ ఎగుర వేయాలని నిర్ణయించారు.
శంకుస్థాపనకు తరలివచ్చే ప్రజల కోసం పెద్ద ఎత్తున ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను సిద్ధం చేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే అవకాశం ఉన్నందున 1,500కు పైగా ఆర్టీసీ బస్సులు, మరో 700 ప్రైవేట్ బస్సులు సిద్ధం చేయాలని చూస్తున్నారు. కాగా, కేంద్రం నుంచి వచ్చే షెడ్యూల్ కోసం సీఆర్డీఏ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈనెల 24-26 తేదీల మధ్య అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశముంది.