జిల్లాలో 2.16 లక్షల పింఛన్లు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:19 AM
నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రతి నెలా రూ.93 కోట్ల అందజేత
జీజీహెచ్ను తనిఖీ చేసిన కలెక్టర్ రాజకుమారి
నంద్యాల హాస్పిటల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సదరం క్యాంప్, డీఎంహెచ్ఓ కార్యాలయం, ఔషధ నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2.16 లక్షల పింఛన్లు ఉన్నాయని, ప్రతి నెలా రూ.93 కోట్ల పింఛన్దారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. వృద్ధాప్య, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో దివ్యాంగుల రీ వెరిఫికేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, వివిధ రకాల దివ్యాంగులు 25వేల మంది ఉన్నారని అలాగే 900 మెడికల్ పింఛన్దారులున్నారన్నారు. వీరందరికీ రీ వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కేంద్రంలో శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి వస్తున్న దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. వారానికి 900 పింఛన్లు రీ వెరిఫికేషన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మెప్పు కోసం
కలెక్టర్ తనిఖీకి వస్తున్న సమాచారం తెలుసుకున్న జీజీహెచ్ శానిటరీ ఇన్చార్జి అవసరంలేని పిచ్చిమొక్కలను మిషన్ ద్వారా తొలగించడం గమనార్హం. పిచ్చిమొక్కలు ఏపుగా ఉన్నచోట ఏనాడూ శుభ్రం చేయని శానిటరీ సిబ్బంది గురువారం కలెక్టర్ మెప్పు కోసం పని చేయడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.