Road Accidents: లారీని ఢీకొట్టిన టూరిస్టు బస్సు.. ఎంతమంది విద్యార్థులు గాయపడ్డారంటే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:00 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.

ప్రకాశం: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతుండగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇంకొంతమంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ (శనివారం) ఉదయం ఏపీ, తెలంగాణలో కలిపి 30 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, ఇతర వాహనదారులు సమాచారాన్ని పోలీసులు, 108 సిబ్బందికి అందించారు. దీంతో బాధితులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఒంగోలు రిమ్స్కు తరలించారు. కృష్ణా జిల్లాలో సైన్స్ ఫేర్లో పాల్గొన్న విద్యార్థులను విహారయాత్ర కోసమని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిద్రమత్తా లేక అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోనూ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంథని మండలం నాగేపల్లి బస్టాప్ వద్ద ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బట్టుపల్లి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం మల్లారానికి మిర్చి పనుల కోసం వెళ్తుండగా ఘోరం జరిగింది. కాగా, బాధితులను మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ హయత్ నగర్ వద్ద రోడ్డుప్రమాదంలో అడిషినల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జి ప్రాణాలు కోల్పోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: ఘోర ప్రమాదం.. అడిషినల్ ఏఎస్పీ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Gold and Sliver Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక బంగారం కొనగలమా..