Trump Tariff Effect on US Billionaires: ట్రంప్ సుంకాలు.. అమెరికా కుబేరుల సంపద ఆవిరి!
ABN, Publish Date - Apr 04 , 2025 | 06:08 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం మొదటగా అక్కడి అపరకుబేరులపైనే పడింది. అగ్రరాజ్యంలోని టాప్ 500 బిలియనీర్ల సంపదలో ఏకంగా 208 బిలియన్లు ఆవిరైపోయాయి.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సుంకాల సెగ మొదటగా అగ్రరాజ్య కుబేరులకే తగిలింది. అక్కడి టాప్ 500 మంది బిలియనీర్ల సంపదలో ఏకంగా 208 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అత్యధికంగా మెటా, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ మీద పడింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సంపద కూడా భారీ స్థాయిలో కరిగిపోయింది.
అమెరికా అపరకుబేరుల సంపద సూచీ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్.. గత 13 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో భారీగా పతనమైంది. సుంకాల దెబ్బకు అపరకుబేరులు తమ సంపద కోల్పోవడంతో సూచీలోనూ ఈ తిరోగమనం ప్రతిఫలించింది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం మార్క్ జకర్బర్గ్ ఏకంగా 17.9 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద విలువ 9 శాతం మేర పతనమైంది. ఆయన ఏకంగా 15.9 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. ట్రంప్కు సలహాదారు, స్నేహితుడు అయిన మస్క్ కూడా 11 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. టెస్లా షేర్లు ఏకంగా 5.5 శాతం మేర పతనమయ్యాయి.
మైఖేల్ డెల్ (9.53 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ (8.1 బిలియన్ డాలర్లు), జెన్సెన్ హువాంగ్ (7.36 మిలియన్లు), లారీ పేజ్ ( 4.79 బిలియన్లు), సెర్గీ బ్రిన్ (4.46 బిలియన్లు), థామస్ పీటర్ఫీ (4.06 బిలియన్లు) భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. అమెరికా కుబేరుల తరువాత ఆ స్థాయిలో నష్టపోయిన విదేశీ బిలియనీర్గా ఫ్రాన్స్కు చెందిన బెర్నార్ట్ ఆర్నాల్ట్ నిలిచారు. బెర్నార్డ్కు చెందిన ఎల్వీఎమ్హెచ్ సంస్థకు చెందిన పలు లగ్జరీ బ్రాండ్స్కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. యూరోపియన్ యూనియన్పై కూడా ట్రంప్ 20 శాతం సుంకాలు విధించడం అక్కడి వ్యాపార వర్గాలకు భారీ కుదుపునిచ్చింది.
అయితే, వాణిజ్య వ్యవహారాల్లో అమెరికాతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కొన్ని దేశాలపై అత్యధిక పన్నులు విధిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ జాబితాలో నెం.1 స్థానంలో ఉన్న చైనాపై తాజాగా 34 శాతం అదనపు టారిఫ్ విధించారు. దీంతో, చైనాపై మొత్తం సుంకాల భారం 54 శాతానికి చేరింది.
ఇది కూడా చదవండి:
భారత్పై అమెరికా సుంకాల ప్రభావం స్వల్పమే: మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి
ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
Updated Date - Apr 04 , 2025 | 06:17 PM