Union AMC CEO: రూ.40,000 కోట్లకు నెలవారీ సిప్
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:56 AM
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నెలవారీ సిప్లు వచ్చే 18–24 నెలల్లో రూ.40,000 కోట్లకు చేరుకుంటాయని యూనియన్ ఏఎంసీ సీఈఓ మధు నాయర్ అంచనా వేశారు. భారతీయుల ఆదాయం, పెట్టుబడి అవగాహన పెరగడం ఇందుకు కారణమని తెలిపారు

వచ్చే 18-24 నెలల్లో చేరుకోవచ్చు..
యూనియన్ ఏఎంసీ సీఈఓ మధు నాయర్ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే 18-24 నెలల్లో దేశీయ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి వచ్చే నెలవారీ క్రమానుగుత పెట్టుబడులు (సిప్) రూ.40,000 కోట్ల స్థాయికి పెరగవచ్చని యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సీఈఓ మధు నాయర్ అంచనా వేశారు. భారతీయ కుటుంబాల ఆదాయంతో పాటు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులపై అవగాహన కూడా పెరుగుతుండటం ఇందుకు దోహదపడనుందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్చిలో ఫండ్ పథకాల్లోకి ‘సిప్’లు రూ.25,925 కోట్లుగా నమోదయ్యాయి. అయితే, స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడుదుడుకుల కారణంగా గత నాలుగు నెలలుగా క్రమానుగుత పెట్టుబడులు తగ్గుతూ వచ్చాయి. అయితే, ఇది తాత్కాలిక పరిణామమేనని.. సిప్లు మళ్లీ పుంజుకోనున్నాయని ఫండ్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో నెలవారీ సిప్ సగటు రూ.24,113 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇది రూ.16,602 కోట్లుగా నమోదైంది.