Share News

US Government: కంప్యూటర్‌ చిప్స్‌, ఫార్మాపై సుంకాల దిశగా అమెరికా పరిశోధన షురూ

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:11 AM

అమెరికా ట్రంప్‌ సర్కారు, కంప్యూటర్‌ చిప్స్‌, చిప్‌ మేకింగ్‌ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్‌ (ఔషధాల)పై సుంకాల విధింపునకు సంబంధించి పరిశోధన ప్రారంభించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం, కాగా చైనా, ఇండియా, యూరప్‌ దేశాలపై ఆధారపడటంపై ఉత్పత్తి భద్రతకు ముప్పు కలుగుతుందని అభిప్రాయం

US Government: కంప్యూటర్‌ చిప్స్‌, ఫార్మాపై సుంకాల దిశగా అమెరికా పరిశోధన షురూ

  • ఆయా ఉత్పత్తులకు ఒకే దేశంపై ఆధారపడడం తమ జాతీయ భద్రతకు ముప్పనే అభిప్రాయం

  • దేశీయంగా తయారీపై పరిశీలన

  • ప్రజాభిప్రాయాలకు 3వారాల గడువు

  • త్వరలోనే ఫార్మాపై సుంకాలు: ట్రంప్‌

  • దేశీయ తయారీని ప్రోత్సహించడానికేనని వెల్లడి

బ్యాంకాక్‌, ఏప్రిల్‌ 15: కంప్యూటర్‌ చిప్స్‌, చిప్‌ మేకింగ్‌ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్‌ (ఔషధాల)పై సుంకాల విధింపునకు సంబంధించి ట్రంప్‌ సర్కారు తదుపరి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా.. కార్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల్లో వాడే కంప్యూటర్‌ చిప్‌లు, వాటిని తయారుచేసే పరికరాలను దిగుమతి చేసుకోవడం దేశ భద్రతపై చూపే ప్రభావాన్ని తెలుసుకునేందుకు పరిశోధన ప్రారంభించినట్టు అమెరికా కామర్స్‌ విభాగం ప్రకటించింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలపడానికి మూడువారాల గడువు ఇచ్చింది. నిజానికి ఈ ఇన్వెస్టిగేషన్‌ను ట్రంప్‌ యంత్రాంగం ఏప్రిల్‌ 1నే ప్రారంభించినట్టు సమాచారం. అందులో వెల్లడైన సమాచారం ఆధారంగానే.. చైనా సహా అన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలపై 10శాతం మూల సుంకాన్ని కూడా మినహాయిస్తున్నట్టు కిందటివారం ప్రకటించింది. ఈ పరిశోధనలో భాగంగా.. అమెరికా డిమాండ్‌కు తగ్గట్టు కంప్యూటర్‌ చిప్‌లు, వాటి తయారీ పరికరాలను తమ దేశంలోనే ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను ట్రంప్‌ సర్కారు పరిశీలించనుంది. వాటిపై పలు దేశాలు తమ ఉత్పత్తిదారులకు ఇస్తున్న రాయితీల కారణంగా అమెరికన్‌ కంపెనీలపై పడే ప్రభావాన్ని కూడా పరిశీలిస్తోంది. కాగా.. ఔషధాలపై సుంకాలు త్వరలోనే వేస్తామని ట్రంప్‌ సోమవారం పునరుద్ఘాటించారు. తమ దేశంలోనే ఔషధాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.


అమెరికాలో తయారయ్యే ఔషధాలకు అవసరమయ్యే ముడిపదార్థాల్లో (యాక్టివ్‌ పార్మా ఇన్‌గ్రీడియెంట్స్‌) 70 శాతానికి పైగా చైనా, ఇండియా, యూరప్‌ దేశాల నుంచి దిగుమతి అయ్యేవే. ఇక.. సెమీకండక్టర్ల విషయానికి వస్తే అమెరికా ఎక్కువగా తైవాన్‌, దక్షిణ కొరియాపై ఆధారపడుతోంది. ల్యాప్‌టా్‌పలు, స్మార్ట్‌ఫోన్లు, వాటి తయారీకి అవసరమయ్యే కాంపొనెంట్లకు సంబంధించి అమెరికా ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. నిరుడు చైనా నుంచి.. అమెరికా దిగుమతి చేసుకున్న ఈ ఉత్పత్తుల విలువ ఏకంగా 174 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్ల) దాకా ఉంది. ఏప్రిల్‌ 2న విధించిన ప్రతీకార సుంకాల కన్నా ముందు.. ఫెంటైనిల్‌ అక్రమరవాణాను నిరోధించడంలో విఫలమైందంటూ చైనాపై ట్రంప్‌ విధించిన 20ు సుంకం కొనసాగుతుందని చెప్పింది ఈ ఉత్పత్తులపైనే. ఈ ఉత్పత్తుల కోసం ఒకే దేశంపై లేదా కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడం అమెరికా భద్రతకే ముప్పు అని ట్రంప్‌ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

Updated Date - Apr 16 , 2025 | 07:13 AM