Share News

Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే

ABN , Publish Date - Apr 04 , 2025 | 08:46 AM

కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు. పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది.. మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైటర్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూశాడా యువకుడు. ఆ వివరాలు..

Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే
Siddharth Yadav

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం అన్నారు పెద్దలు. ఏ నిమిషం మృత్యువు కబళిస్తుందో తెలియదు. కానీ మనం మాత్రం నిండు నూరేళ్లు జీవితం గురించి ఎన్నో కలలు కంటాం.. ఆశలు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం చెప్పకోబోయే వ్యక్తి కూడా అలానే అందమైన నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నాడు. కష్టపడి చదివి.. కోరుకున్న ఉద్యోగం సాధించాడు. కొడుకు జీవితంలో సెటిల్ అయ్యాడు.. ఇక పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందని భావించిన తల్లిదండ్రులు.. మంచి సంబంధం చూసి.. వివాహం నిశ్చయించారు. పది రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ చేశారు. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటున్న ఆ యువకుడి జీవితాన్ని ప్లేన్ క్రాష్ బలి తీసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తోంది. చేతికి అంది వచ్చిన కొడుకు చేదోడుగా ఉంటాడని ఆశిస్తున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది. ఆ వివరాలు..


గుజరాత్, జామ్‌నగర్ సమీపంలో భారత వాయుసేనకు చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆ పైలెట్ వివరాలు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి పేరు సిద్ధార్థ్ యాదవ్.. వయసు 28 సంవత్సరాలు. హరియాణా, రేవారి ప్రాంతానికి చెందిన వాడు. పది రోజుల క్రితమే అనగా మార్చి 23న అతడికి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడది నవంబర్‌ 2న వివాహం చేయడానికి నిశ్చియించారు. సెలవు ముగిసిన తర్వాత మార్చి 31న తిరిగి విధుల్లో చేరాడు సిద్ధార్థ్.


విధుల్లో భాగంగా గురువారం నాడు మరో కోపైలెట్‌తో కలిసి జాగ్వర్ ఫైటర్ జెట్‌లో ప్రయాణం మొదలు పెట్టాడు. అయితే కాసేపటికే.. జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రమాదం తప్పదని భావించాడు. అప్పటికే వారు జామ్‌నగర్‌కు సమీపంలో ఉన్నారు. జెట్ అక్కడ కూలితే.. చాలామంది ప్రజలు మరిణించే అవకాశం ఉందని భావించిన సిద్ధార్థ్.. ఎలాగోలా కష్టపడి జామ్‌నగర్‌కు 12 కిమీ దూరంలో ఉన్న సువద్ర గ్రామ సమీపంలో విమానం కూలిపోయేలా చేశాడు. అప్పటికే సిద్ధార్థ్‌తో ఉన్న కోపైలెట్ ప్రమాదం నుంచి తప్పించుకోగా.. అతడు మాత్రం దానిలో చిక్కుకున్నాడు. ఫైటర్ జెట్ కింద పడగానే.. కుప్పకూలి రెండు ముక్కలయ్యింది. దాన్నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ అక్కడికక్కడే మృతి చెందాడు.


సిద్ధార్థ్ కుటుంబం కొన్ని తరాలుగా మిలిటరీలో పని చేస్తున్నారు. అతడి తాతముత్తాతలు బ్రిటీష్ కాలం నుంచే మిలిటరీలో వేర్వేరు విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఇక సిద్ధార్థ్ తండ్రి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేశాడు. ఆ కుటుంబం నుంచి మిలిటరీలో సేవలు అందిస్తున్న వారిలో సిద్ధార్థ్ నాలగవ తరం వాడు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ తండ్రి మాట్లాడుతూ.."నా కొడుకు చిన్నప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని కలలు కన్నాడు. దానికి తగ్గట్టుగానే బాగా చదివేవాడు. 2016లో ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు అనంతరం ఫైటర్ పైలెట్‌గా విధుల్లో చేరాడు. రెండు సంవత్సరాల తర్వాత ప్రమోషన్ కూడా పొందాడు" అని చెప్పుకొచ్చాడు.


"నా కొడుకును చూసి నేను చాలా గర్విస్తున్నాను. ప్రమాదం జరగబోతుందని తెలిసి.. ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. సామాన్యుల ప్రాణాలు పోకుండా కాపాడాడు. తాను మరణించిన పర్లేదు.. ప్రజలకు ఏం కాకూడదని కోరుకున్నాడు. అలానే తన కోపైలెట్ ప్రాణాలు కాపాడాడు. తను చూపిన ధైర్యసాహసాలకు నేను ఎంతో గర్విస్తున్నాను. కానీ కన్న తండ్రిగా ఎంతో బాధపడుతున్నాను. ఈ కడుపుకోత ఒక్కనాటితో తీరేది కాదు కదా" అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు.


సిద్ధార్థ్ మరణ వార్త తెలిసి అతడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ప్రమాద దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది.


ఇవి కూడా చదవండి:

సనోజ్ మిశ్రాపై రేప్ కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నటి

ఉదయం పరగడుపున ఈ వాటర్ తాగితే ఆరోగ్యం..

Updated Date - Apr 04 , 2025 | 11:01 AM