Hyderabad Sexual Assault: హైదరాబాద్లో విదేశీ యువతిపై అత్యాచారం
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:55 AM
హైదరాబాద్లో సాంస్కృతిక అనుభవం కోసం వచ్చిన జర్మనీ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ముంబయి చెందిన నిందితుడు యువతిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు పై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్లో దారుణం స్నేహితునితో కలిసి నగర సందర్శనకు
వెళ్లగా వారితో మాటలు కలిపిన నిందితుడు
నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లి రేప్
యాకత్పురాకు చెందిన నిందితుడి అరెస్టు
గత నెలలో జర్మనీ నుంచి వచ్చిన బాధితురాలు
హైదరాబాద్సిటీ/పహాడీషరీ్ఫ/సరూర్ నగర్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చూద్దామని హైదరాబాద్కు వచ్చిన విదేశీ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం సాయంత్రం ఈ అఘాయిత్యం జరగ్గా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట ప్రాంతానికి చెందిన యువకుడు ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. అతనికి గత ఏడాది జర్మనీకి చెందిన యువతి, యువకుడితో స్నేహం ఏర్పడింది. మీర్పేట యువకుడు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి తరచూ తన స్నేహితులతో చెప్తుండేవాడు. దాంతో వారు హైదరాబాద్ వస్తామని చెప్పేవారు. ఈ నేపథ్యంలో జర్మనీ యువతి, యువకుడు గత నెల 4న హైదరాబాద్ వచ్చారు. మీర్పేటలోని స్నేహితుడి ఇంట్లో ఉంటూ పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం రంజాన్ పండుగ రోజున స్థానికంగా ఓ కాలనీలో కూరగాయల సంతను చూద్దామని జర్మనీ యువతి, యువకుడు సాయంత్రం 6:30 సమయంలో బయటకు వచ్చారు. అదే సమయంలో మహ్మద్ అబ్దుల్ అస్లాం అనే వ్యక్తి ఐదుగురు మైనర్లను తీసుకుని కారులో షికారుకు బయల్దేరాడు. రోడ్డుమీద ఉన్న విదేశీయులు ఇద్దర్నీ చూసి కారు ఆపాడు. అస్లాంకు గతంలో దుబాయ్లో కారు డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఉండటంతో ఇంగ్లిష్లో మాట్లాడి విదేశీయులను పరిచయం చేసుకున్నాడు. వారు దగ్గరలోని కూరగాయల సంతకు వెళ్లాలని చెప్పడంతో తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే కారులో పెట్రోల్ పోయించి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తానంటూ నమ్మించి మామిడిపల్లివైపు తీసుకెళ్లాడు. అక్కడ అందరికీ ఫొటోలు తీస్తానని చెప్పి కారులోంచి దింపాడు.
ఫొటోలు తీసిన తర్వాత జర్మనీ యువకుడితో సెల్ఫీలు దిగండి... తాను ఇప్పుడే వస్తానంటూ మైనర్లకు చెప్పి.. ఆ యువతిని కారులో ఎక్కించుకుని కొద్దిదూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ యువతిని బెదిరించి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి మైనర్లు ఉన్న చోటుకు వస్తున్న క్రమంలో కారును స్లో చేయగా.. ఆ యువతి కారులోంచి దూకేసి జరిగిన దారుణాన్ని తన స్నేహితుడికి చెప్పింది. వెంటనే ఇద్దరూ ఆటోలో మీర్పేటకు చేరుకుని స్థానిక స్నేహితుడిని కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో పోలీసులు సీసీటీవీ కెమెరాల సాయంతో నిందితుడు యాకుత్పురాకు చెందిన అస్లాంను గుర్తించి.. అరెస్టు చేశారు. అతను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా హైదరాబాద్లోనే ఖాళీగా ఉంటున్నాడు. రంజాన్ రోజు లాంగ్ డ్రైవ్ యాప్లో కారును అద్దెకు తీసుకుని స్థానిక స్నేహితులతో (9 నుంచి 12 ఏళ్లు) కలిసి షికారుకు వెళ్లాడు. మార్గమధ్యలో విదేశీ యువతి కనిపించగానే.. మాటలు కలిపి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులు బాధిత యువతిని కలిసి పరామర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, దీనికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శించారు. నిందితుడితో పాటు కారులో ఉన్న మైనర్ల ఫొటోలు పోలీసులకు చూపించినా మంగళవారం రాత్రి వరకు వారిని అరెస్టు చేయలేదని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News