Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
ABN , Publish Date - Jan 20 , 2025 | 08:54 AM
తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన ముగించుకుని దావోస్కు వెళ్లింది. సోమవారం (20వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.

Davos: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం (Team) సింగపూర్ (Singapore) పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి దావోస్ (Davos) పర్యటనకు బయలుదేరింది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఉన్నారు. దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పి పెట్టుబడులను తెచ్చే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్ లో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకానున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సోమవారం (20వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, తయారీ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోపాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ)పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాది దావోస్ పర్యటనతోపాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి.
భారీ ఐటీ పార్కు..
కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో ఉండనున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ.. హైదరాబాద్లో తమ పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించింది.
సింగపూర్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ.. ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. కాగా, క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయాన్ని సీఎం రేవంత్రెడ్డి స్వాగతించడంతోపాటు ఈ కంపెనీ చేపట్టే కొత్త ఐటీ పార్కు నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కంపెనీ ప్రతినిధి గౌరీశంకర్ నాగభూషణం మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో అంతర్జాతీయ టెక్పార్కు (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెరల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తికానుందని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సింగపూర్ పర్యటనలో భాగంగా మూడోరోజు సీఎం రేవంత్రెడ్డి బృందం.. అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్బీఎఫ్) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓసియన్ గ్రూప్ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్శర్మ, బ్లాక్స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్వీ టాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్తో రేవంత్రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఎం రేవంత్ వారికి వివరించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీంతో.. రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతోపాటు అధికారులతో కూడిన ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం చేపట్టిన మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం రాత్రి ఈ బృందం స్విట్జర్లాండ్లోని దావో్సకు బయలుదేరింది. దావోస్ వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ప్రపంచ ఆర్థిక ఫోరం’ వార్షిక సదస్సులో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఆ వేదికపై తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో సోమవారం నుంచి యధావిధిగా దర్శనాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News