దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:44 AM
దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వారిని నరికిచంపిన పాకిస్థానీ.. మరో ఇద్దరిపైనా దాడి
విద్వేషంతోనే హత్య?.. చంపిన తర్వాత మత నినాదాలు
అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు
మృతుల్లో ఒకరిది నిర్మల్.. మరొకరిది నిజామాబాద్ జిల్లా
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్సాగర్ (40) కాగా, మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని.. గాయపడ్డ ఇద్దరూ కూడా తెలుగువారేనని తోటి ఉద్యోగులు చెప్పారు. మృతులు, గాయపడ్డ ఇద్దరు, ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్థానీ... అందరూ దుబాయిలోని ఒక ప్రఖ్యాత బేకరీలో పని చేస్తున్నారు.
పని ఒత్తిడి, ఇతర కారణాలకు మతవిద్వేషం కూడా తోడవడంతోనే దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని.. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. విషయం ఏ మాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల్లోంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది. అక్కడ పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది తెలంగాణకు చెందినవారేనని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.