కుంభమేళాకు తెలుగు ప్రవాసీలు!
ABN, Publish Date - Feb 21 , 2025 | 05:05 AM
నిత్య యాంత్రిక జీవనం, భిన్న సంస్కృతులుండే గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రవాసీ భక్తులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఎడారి దేశం నుంచి పెద్ద సంఖ్యలో రాక
ప్రభుత్వ ఏర్పాట్లు భేష్ : భక్తుల ప్రశంస
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ న్యూస్): నిత్య యాంత్రిక జీవనం, భిన్న సంస్కృతులుండే గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రవాసీ భక్తులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎడారి పెట్రో దినార్ల నుంచి బయటపడి మాతృదేశంలో ఆధ్మాత్మికతను ఆస్వాదిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బావున్నాయని ప్రశంసిస్తున్నారు. ప్రయాగ్రాజ్, వారణాసి, ఆయోధ్య తీర్థస్థలాల సందర్శన అనంతరం తిరిగి గల్ఫ్కు వస్తున్నారు. ఎటు చూసినా జనసముద్రంలా కనిపించే గంగ, యుమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం తన జీవిత కాలపు స్వప్నమని సౌదీ అరేబియాలో పని చేసే టి.మల్లికార్జున్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
స్నానఘట్టాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వం చేసిన ముందస్తు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. త్రివేణి సంగమంలో స్నానం అనంతరం అయోధ్యలో రేయింబవళ్లు అనే తేడా లేకుండా జనజాతరలో కలిసి శ్రీరాముడిని దర్శించుకోవడం వర్ణనాతీతమని దుబాయ్లో పని చేసే ఏపీలోని తణుకుకు చెందిన వేగ్నస్న శివరామకృష్ణ భావోద్వేగపూరితంగా చెప్పారు. తన జీవితంలో ఇసుకేస్తే రాలనంతగా జనాలను చూడడం ఇదే ప్రథమమని ఖతర్లో నివాసముండే హైదరాబాద్కు చెందిన సాయి సుధ పేర్కొన్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా తాను పొందిన ఆధ్యాత్మిక అనుభూతి అమూల్యమని ఖతర్లో పనిచేసే కరీంనగర్కు చెందిన వెలదండి-రుచికలు చెప్పారు.
Updated Date - Feb 21 , 2025 | 05:53 AM