Uttam Kumar Reddy: దేవన్నపేట పంప్‌హౌస్‌ 19న ప్రారంభం

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:54 AM

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌ్‌సలో ఒక మోటార్‌ను ఈ నెల 19వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Uttam Kumar Reddy: దేవన్నపేట పంప్‌హౌస్‌ 19న ప్రారంభం
  • ఒక మోటార్‌ను ప్రారంభించనున్న మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌ్‌సలో ఒక మోటార్‌ను ఈ నెల 19వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో అధికారులు ఆ మోటార్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. వాస్తవానికి ఈ పంప్‌హౌస్‌ ఇప్పటికే సిద్ధమయింది. అయితే ఏదైనా ప్రమాదం జరిగితే రక్షణ చర్యలు తీసుకోవడం కష్టమని, అందువల్ల పైపులను సిమెంట్‌తో కేసింగ్‌ చేయాలని నిపుణులు సిఫారసు చేశారు. అత్యంత లోతులో పంప్‌హౌస్‌ ఉండటంతో వాల్వ్‌లో ఏవైౖనా సమస్యలు వచ్చి... నీరు వెనక్కి తన్నితే పంప్‌హౌస్‌ మొత్తం దెబ్బతింటుందని, అందులో పనిచేసే ఉద్యోగులు బతికి బట్టకట్టే అవకాశాల్లేవన్న హెచ్చరికలతో గత రెండు నెలలుగా సిమెంట్‌ కేసింగ్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా యాసంగిలో దేవాదుల కింద నీటి విడుదల కీలకం కావడంతో ఒక్క మోటార్‌నైనా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో ఎత్తిపోతల పథకాల సలహాదారుడు పెంటారెడ్డితో పాటు అధికారులంతా వారం రోజులుగా అక్కడే మకాం వేసి... మోటార్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఒక్కోటి 30 మెగావాట్ల సామర్థ్యం గల మూడు మోటార్లు దేవన్నపేటలో ఉన్నాయి. ఒక్కో మోటార్‌ 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనుంది. దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్వహణ చూసే సంస్థకు చెందిన కార్మికులు నెల రోజుల పాటు సమ్మె చేయడంతో ఈ పథకంలోని పలు రిజర్వాయర్లలో నీటి కష్టాలు మొదలయ్యాయి. దేవన్నపేటలో ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన ఒక మోటార్‌ను సిద్ధం చేస్తుండగా... మూడు మోటార్లు సిద్ధమైతే 1,800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా... యాసంగిలో 1.90 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. పంటలు కీలక దశలో ఉండటంతో దేవన్నపేట పంప్‌హౌ్‌సను ఏ విధంగానైనా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Updated Date - Mar 18 , 2025 | 04:54 AM