హైదరాబాద్‌లో ‘గోల్డ్‌మెన్‌ శాక్స్‌’ విస్తరణ

ABN , First Publish Date - 2023-08-24T03:23:12+05:30 IST

అంతర్జాతీయ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.

హైదరాబాద్‌లో ‘గోల్డ్‌మెన్‌ శాక్స్‌’ విస్తరణ

స్వాగతించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ బుధవారం న్యూయార్క్‌లోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ సీఈవో డేవిడ్‌ ఎం సోలమన్‌ బృందంతో సమావేశమయ్యారు. అనంతరం కంపెనీ తన విస్తరణ వివరాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నామని సంస్థ తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంలో ప్రస్తుతం వెయ్యి మంది ఉద్యోగులుండగా, విస్తరణతో మరో రెండువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించనున్నామని సంస్థ తెలిపింది. బిఎ్‌ఫఎ్‌సఐ రంగాల్లో హైదరాబాద్‌ నగరాన్ని అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సంస్థ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం ద్వారా ఈ రంగంలో హైదరాబాద్‌ స్థానం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తమ కంపెనీ విస్తరణ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్న సంస్థ ప్రతినిధుల బృందానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-08-24T03:23:12+05:30 IST