గడపగడపలో సమస్యలపై కొత్తకోట మహిళలు ఏకరువు

ABN , First Publish Date - 2023-02-05T23:08:50+05:30 IST

‘నిక్షేపంలా ఉన్న రోడ్డును కొళాయిల ఏర్పాటు పేరుతో తవ్వేశారు.. ఉన్న రోడ్డు పోయింది.. సక్రమంగా తాగునీరు అందడం లేదంటూ’’ కొత్తకోట పంచాయతీ తాడుపెద్ది వీధిలో మహిళలు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీని నిలదీశారు.

గడపగడపలో సమస్యలపై కొత్తకోట మహిళలు ఏకరువు
ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీని సమస్యలను తెలుపుతున్న మహిళ

రావికమతం, ఫిబ్రవరి 5: ‘‘నిక్షేపంలా ఉన్న రోడ్డును కొళాయిల ఏర్పాటు పేరుతో తవ్వేశారు.. ఉన్న రోడ్డు పోయింది.. సక్రమంగా తాగునీరు అందడం లేదంటూ’’ కొత్తకోట పంచాయతీ తాడుపెద్ది వీధిలో మహిళలు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీని నిలదీశారు. అనంతరం సమస్యలను ఏకరువు పెట్టారు. మేజరు పంచాయతీ కొత్తకోటలో ఆదివారం రెండో రోజు నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ధర్మశ్రీ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. మా వీధిలో ఇంటింటా కొళాయిల కోసం రోడ్డుకు రెండు వైపులా తవ్వేసి వదిలేయడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందుల పాలవుతున్నట్టు గుమ్ముడు నాగమణి, కొల్లి రత్నం, అడప దేవిశ్రీ, సైలపు అన్నసూయ, చిత్రాడ లక్ష్మి తదితరులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. వేసిన కొళాయిల ద్వారా తాగునీటి సరఫరా సక్రమంగా కావడం లేదన్నారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించకపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. వీధిలోని డ్రైనేజీ నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తన భర్త చనిపోయి ఒంటరిగా ఉన్నానని, సొంతిల్లు లేక ఇబ్బంది పడుతున్నానని, ఇంటి స్ధలంతోపాటు ఇల్లు మంజూరు చేయాలని పొన్నగంటి భువనేశ్వరి వాపోయింది. శీలం వీధి, గుమ్ముడు వీధితోపాటు కుంచా మహాలక్ష్మి ఇంటి నుంచి వెదురుపర్తి బ్రహ్మజీ ఇంటి వరకూ ఉన్న డ్రైనేజీలను బాగుచేయాలని కోరారు. ఇలాంటి చిన్నపాటి సమస్యలు పంచాయతీ పరిష్కరించకుంటే ఎలా అని ఎమ్మెల్యే ధర్మశ్రీ అసహనం వ్యక్తం చేశారు. ఈసమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలరాజు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T23:08:52+05:30 IST