Share News

Amit Shah: పీఓకే జోలికొస్తే తాట తీస్తాం.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు

ABN , First Publish Date - 2023-12-11T21:50:51+05:30 IST

నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా ఆర్టికల్‌ 370 శాశ్వతమైనదేనని ఎవరైనా చెప్తే..

Amit Shah: పీఓకే జోలికొస్తే తాట తీస్తాం.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు

Amit Shah On Article 370: నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా ఆర్టికల్‌ 370 శాశ్వతమైనదేనని ఎవరైనా చెప్తే.. వాళ్లు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించినట్లే అవుతుందని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసిందని.. అది తీవ్రవాదాన్ని ప్రోత్సాహించిందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కూడా విమర్శలు చేశారు.

రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్ కంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మన భారత్‌లో ఉన్నాయని, కానీ జమ్ముకశ్మీర్ ఒక్కటే ఉగ్రవాదంతో ఎందుకు బాధపడుతోందని ప్రశ్నించారు. అందుకు కారణం ‘ఆర్టికల్ 370’ వేర్పాటువాదానికి దారితీసిందని ఎత్తిచూపారు. ఈ ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదని తేల్చి చెప్పారు. సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని, ఈ హామీకి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని దుయ్యబట్టారు. కశ్మీరీలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 ముసుగులో మూడు కుటుంబాలు అధికారాన్ని అనుభవించాయని.. గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్ని హక్కులనూ కోల్పోయారని అన్నారు.


పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారతదేశంలో భూభాగమని, దానిని ఎవరూ ఆక్రమించలేరని అమిత్ షా తేల్చి చెప్పారు. ఒకవేళ కాదని ఎవరైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తే.. వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేవలం ఒకే వ్యక్తి వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్‌ భాగం కావడం ఆలస్యమైందంటూ.. జవహర్ లాల్ నెహ్రూని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో కాల్పుల విరమణ లేకపోయి ఉంటే అసలు పీఓకే ఉండేది కాదన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రివర్గం, బీజేపీ పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారీ స్థాయిలో దాడులు జరగలేదన్నారు. ఉరీ, పుల్వామా సెక్టార్లలో మారణహోమం సృష్టించిన వారిని.. వాళ్ల ఇంటికి వెళ్లి మరీ హతమార్చామన్నారు. ఇప్పుడు దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉన్నారని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ.. కోర్టు తీర్పుపై ఆ పార్టీ సంతృప్తిగా లేదని అమిత్ షా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 సరికాని విధంగా రద్దు చేయబడిందని కాంగ్రెస్ చెప్పిందని.. సుప్రీం తీర్పుని వాళ్లు అంగీకరించడం లేదని అన్నారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసిందని.. వాటిని నాలుగేళ్లలోనే మోదీ ప్రభుత్వం సరిదిద్దాలని ఆశించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. నెహ్రూ లేకపోతే కశ్మీర్ ఉండేది కాదని కొందరు చెప్తున్నారని.. మరి హైదరాబాద్‌కి సమస్య వచ్చినప్పుడు నెహ్రూ అక్కడికి వెళ్లారా? అని చరిత్ర తెలిసిన వాళ్లని అడగాలనుకుంటున్నానని ప్రశ్నించారు. లక్షద్వీప్, జోధ్‌పూర్‌కి కూడా వెళ్లలేదని.. కేవలం కశ్మీర్‌కి మాత్రమే వెళ్లేవారని.. అక్కడ కూడా పనిని అసంపూర్తిగా వదిలేశారని అమిత్ షా చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-12-11T21:59:15+05:30 IST